పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది.
–మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. వికలాంగులకు రూ.3,016 పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్లు, చేతికర్రలు, త్రీవీలర్ స్కూటీలతోపాటు, కృత్రిమ కాళ్లు, చేతులు తయారుచేసే యూనిట్తో హైదరాబాద్లో అతిపెద్ద పార్క్ను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా దీని ఏర్పాటుకు కృషిచేస్తామని చెప్పారు. వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదన్నారు. రూ.24.38 కోట్లతో 16,600 మంది దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని చెప్పారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు.
ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీతోపాటు, ఇతర అన్ని సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగ ఉద్యోగులకు రూ.2,000, ఎస్జీటీలకు రూ.1000, స్కూల్ అసిస్టెంట్లకు రూ.1500, కాలేజీ లెక్చరర్లకు రూ.2,000 ప్రత్యేక అలవెన్సులు ఇస్తున్నామన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కింద వికలాంగ సోదరీమణులకు రూ.1,25,145 ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలతో 2018, 2019లో కేంద్రం దివ్యాంగుల సంక్షేమంలో అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి, రెండుసార్లు అవార్డులు అందజేసిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, దివ్యాంగుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఎండీ శైలజ, మాజీమంత్రి బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు. వినికిడి లోపం, చేతులులేని విద్యార్థులు కాళ్లతో వేసిన పెయింటింగ్స్ను అతిథులకు అందజేశారు. అనంతరం దివ్యాంగులకు పంపిణీ చేసిన త్రిచక్ర (రిట్రో పిట్టెడ్) మోటర్ బైక్లను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రి కొప్పుల
అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళుతున్నారని షెడ్యూల్డ్ కులాలు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగులకు వినూత్న సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు.. ఎవరి సాయం లేకున్నా బతకగలమనే ఆత్మైస్థెర్యాన్ని వారిలో నింపిందని పేర్కొన్నారు. ఏటా దివ్యాంగులకు రూ.1,800 కోట్లు పింఛన్ ఇస్తున్నాయని తెలిపారు. అర్హులైనవారు ఎవరు దరఖాస్తు చేసుకున్నా పరికరాలు అందజేస్తామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. నల్లగొండలో ఫ్ల్లోరైడ్ పీడను పారద్రోలిన సీఎం కేసీఆర్ అక్కడి వికలాంగులను ఆదుకొనేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.