హైదరాబాద్, జనవరి 10 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కౌటాల మండలం తమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన బరాజ్ను సాంకేతిక కారణాలతో ఎగువన వార్ధా నదిపై నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మిడిహట్టి వద్ద ఉన్న ప్రతికూల పరిస్థితులు, బరాజ్ నిర్మాణానికి అధికంగా ఖర్చు అవుతుండటమే ఈ మార్పునకు కారణమని తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల రీడిజైన్లో భాగంగా తమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కీలక మార్పులు చేశారు. ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసి మొదటగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. వెన్గంగా, వార్ధా నదులు కలిసే తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 5 నియోజకవర్గాల పరిధిలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. దానికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. సీఎం కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర సీఎంతో చర్చిం చి, ఈ ప్రాజెక్టుకు అడ్డంకులను తొలగించారు. ముంపును నివారించేందుకు బరాజ్ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. కానీ అనేక సాంకేతిక కారణాలతో ఈ బరాజ్ నిర్మాణం ముందుకు సాగడంలేదు. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక దఫాలుగా ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. చివరకు బరాజ్ను వార్ధాపైనే నిర్మించాలని నిర్ణయించారు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి పరిస్థితులు సానుకూలంగా లేవని అధికారులు గుర్తించారు. గత ప్రతిపాదన ప్రకారం వార్ధా, వెయిన్గంగా నదులు కలిసిన తర్వాత తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉన్నది. సాధారణంగా నదిపై బరాజ్ను నిర్మించాలంటే నీటి ప్రవాహం 90 డిగ్రీల లంబకోణంలో ఉండాలి. తమ్మిడిహట్టి వద్ద పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నదని గుర్తించారు. ఇక్కడ కేవలం 40 డిగ్రీల స్క్యూ షేప్లో బరాజ్ను నిర్మించాల్సి వస్తున్నది. ఇది అంత క్షేమదాయకం కాదని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు స్క్యూ షేప్లో బరాజ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎక్కడా అందుబాటులో లేవు. తమ్మిడిహట్టి వద్ద 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బరాజ్ నిర్మించాంటే సుమారు 6 కిలోమీటర్ల మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టాలి. 100 నుంచి 110 గేట్లు ఏర్పాటు చేయాలి. బరాజ్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తున్నదని అధికారులు లెక్కలు వేశారు. కేవలం 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అంత పెద్ద మొత్తం వెచ్చించడం నిరర్థకమని, అదీగాక మున్ముందు నిర్వహణ భారమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ్మిడిహట్టి పక్కనే చాప్రాల్ అభయారణ్యం ఉన్నది. దీనివల్ల భవిష్యత్తులో సీడబ్ల్యూసీ అనుమతులు పొందడానికి ఆటంకాలు ఏర్పడే అవకాశమున్నది. ఈ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని బరాజ్ను వార్ధాపై నిర్మించాలని నిర్ణయించారు.
ముంపు లేకుండానే వార్ధా బరాజ్
ప్రస్తుతం వార్ధాలో 58 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు అధికారులు తేల్చారు. బరాజ్కు కావాల్సినవి 20 టీఎంసీలే. దీంతో వార్ధాపైనే బరాజ్ నిర్మించాలని నిర్ణయించారు. వార్ధాపై 500 నుంచి 600 మీటర్ల పొడవుతోనే బరాజ్ను నిర్మించవచ్చు. అందుకు రూ.600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. బరాజ్ నిర్మాణ ప్రాంతం మార్పు వల్ల ప్రభుత్వానికి రూ.1,500 కోట్లపైగా ఆదా అవుతున్నది. వార్ధాపై ముంపు లేకుండానే బరాజ్ను నిర్మించవచ్చని సాగునీటిరంగ నిపుణులు తేల్చారు. అనుమతుల మంజూరుకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు. వార్ధా బరాజ్పై ప్రభుత్వం ఇప్పటికే వ్యాప్కోస్ ద్వారా ప్రాథమిక సర్వే చేయించింది. బరాజ్ డీపీఆర్ను సిద్ధంచేసి సీడబ్ల్యూసీకి పంపాలని అధికారులను ఆదేశించింది.