హైదరాబద్: మండల పరిషత్, జిల్లా పరిషత్లకు నిధులు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు కేటాయించింది. దీనిలో భాగంగానే మొత్తం రూ.250 కోట్లు విడుదల చేసింది.
వీటిలో జిల్లా పరిషత్లకు రూ.125.87 కోట్లు.. మండల పరిషత్లకు 124.12 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు నిధుల విడుదలపై పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్లకు ఈ నిధులను విడుదల చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్లకు 125 కోట్ల 87 లక్షల 50 వేల 500 రూపాయలు, మండల పరిషత్లకు 124 కోట్ల 12 లక్షల 49వేల 500 రూపాయలు విడుదల అయ్యాయి.
కాగా, ఈ నిధుల విడుదలకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను జిల్లా, మండల పరిషత్ల అభివృద్ధి, వాటి పరిధిలోని ప్రజల పురోగతికి సక్రమంగా వినియోగించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.