హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో రెండు ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పీఏ ప్రవీణ్ తెలిపారు. ఇందులో ఒకటి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎలిమినేడులో, మరొక పార్కు కోసం స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉన్నదని చెప్పారు. రాష్ట్రం లో ఏరోస్పేస్, డిఫెన్స్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రంగాలకు అవసరమైన నిపుణులను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రైవేట్రంగంలో ఏరోస్పేస్ వర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ క్రమంలో గురువారం హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ ఆరవ రక్షణ సదస్సులో ‘స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ తయారీ రంగంలో ఆత్మనిర్భరత’ అంశంపై ప్రవీణ్ మాట్లాడుతూ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అవసరమైన ఉద్యోగులను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే టీఎంఆర్ఎంఆర్వో,ఎయిరిండియా ఎంఆర్వోలకు నిలయంగా ఉన్నదన్నారు. ప్రముఖ విమాన పరికరాల తయారీ సంస్థ శాఫ్రాన్ ఇటీవలే రాష్ట్రంలో రూ. 1500కోట్లతో తమ విస్తరణ ప్రణాళికను ప్రకటించిందని గుర్తుచేశారు.
ప్రభుత్వం డ్రోన్ టెస్టింగ్ కారిడార్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే పలు ఏరోస్పేస్, రక్షణ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ప్రాట్ అండ్ విట్నీ వంటి కంపెనీలు హైదరాబాద్లో ఇంజిన్ శిక్షణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు.ప్రముఖ శాస్త్రవేత్త వై శ్రీనివాస్రావు మాట్లాడుతూ సైనికుల కోసం అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొంటూ కనీసం 20 ఏండ్లపాటు పనిచేసే ఆధునిక ఆయుధాలను తయారు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.