హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ను నూతనంగా ఏర్పాటు చేసింది. చైర్మన్, సభ్యులను సైతం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి రెండేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్స్ను ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ చైర్మన్గా సూదిని రామిరెడ్డి, సభ్యులుగా నగునూరి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్ యాదవ్ను నియమించింది. ఇక కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించడం వరకే పరిమితమవుతున్నది తప్ప నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో కార్పొరేషన్లన్నీ ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నాయి.
కార్పొరేషన్లు అనేవి ఆయా లక్షిత సామాజి క వర్గాల ఆర్థిక అభ్యున్నతికి, ఉపాధి నైపుణ్య శిక్షణకు దోహదపడతాయి. ప్రతి కార్పొరేషన్ ఏటా ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ఆయా వర్గాలకు సబ్సిడీ రుణాలను అందించడం పరిపాటి. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు, కుల వృత్తిదారులకు నైపుణ్య కార్యక్రమాలను నిర్వహించడం కూడా కార్పొరేషన్ విధుల్లో ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25, 2025-26, 2026-27 బడ్జెట్లో ఆయా కార్పొరేషన్లకు ప్రతిపాదనలను చేసింది. సంక్షేమానికి వేల కోట్ల నిధులు కేటాయించామని ఊదరగొట్టింది. కొత్త కార్పొరేషన్లకు రూ. 50 కోట్ల చొప్పున కేటాయించామని ప్రగల్భాలు పలికింది. కానీ ఆచరణలో గడచిన 30 నెలల కాలంలో ఒక్క కార్పొరేషన్కూ రూపాయి కూడా విదల్చలేదు.
