హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణకు గాను ప్రభుత్వం రూ. 29.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బీసీ గురుకులాల నిర్వహణకు 2021-22 బడ్జెట్లో ప్రభుత్వం మొత్తంగా రూ.116.20 నిధులను కేటాయించగా అందులో ఇదివరకే రూ.87.15 కోట్లను విడుదల చేసింది. మిగిలిన రూ.29.5 కోట్లను తాజాగా విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
ఉద్యోగుల పీఆర్సీకి రూ.16.69 కోట్లు
బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పీఆర్సీ అమలు కోసం రూ.16.69 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గురుకుల సిబ్బందికి సంబంధించి వేతనాల కోసం 2021-22 బడ్జెట్లో 140.99 కోట్లను కేటాయించడంతో పాటు అందుకు సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేసింది. వారికి పీఆర్సీని వర్తింపజేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు చేసిన సంగతి తెలిసిందే. అదనంగా రూ.16.69 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఆ మొత్తాన్ని విడుదల చేస్తూ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.