హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు చర్యలు ప్రారంభించలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ను న్యూస్పేపర్లలో ప్రముఖంగా ప్రచురించింది. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీఇచ్చింది. ఒకటో తారీఖు గడిచి 11 రోజులవుతున్నా ఇప్పటికీ ఆ ఊసే త్తలేదు. ఇక నోటిఫికేషన్లు, మెగా డీఎస్సీ మాటే ఎత్తడంలేదు. నోటిఫికేషన్లు ఆలస్యమవుతుందనో ఏమో.. ఉద్యోగాలకు వయోపరిమితిని (Age Limit) మరో రెండేండ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ప్రస్తుతమున్న గరిష్ఠ వయోపరిమితిని 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు పెంచింది. అయితే యూనిఫామ్ సర్వీసుకులకు దీనిని నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ఉద్యోగాల భర్తీ కూడా ఒకటి. తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రస్తావించక పోవడం గమనార్హం.