హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులందరికీ, ప్రజలకు పోషకాహారం అందించడమే సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం లక్ష్యమని, ఇందుకోసం రూ. 42 కోట్లతో నూతన ఫ్లాంట్ నిర్మిస్తున్నట్లు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దేశంలో ఎక్కడలేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పిల్లల కోసం బాలామృతం వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పోషకాహార పంపిణీకి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని సాగర్ పేర్కొన్నారు.
ఇప్పుడు వినియోగంలో ఉన్న ఫ్లాంట్ 1975 సంవత్సరంలో నిర్మించింది కాబట్టి రానున్న తరాలకు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం అందించడానికి నాచారంలోని ప్యాక్టరీ ప్రాంగణంలో మరో ఫ్లాంట్ నిర్మిస్తున్నట్లు వివరించారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఫ్లాంట్ ద్వారా గంటలకు నాలుగు మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగనున్నట్లు వివరించారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం రూ.42 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ జీఎం విజయలక్ష్మి, ఆయా విభాగాల మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు కృష్ణవేణి, శ్రీనివాస్ నాయక్, ఏలమంద, వెంకటయ్య , కోటేశ్వరావు, బాబు తదితరులు పాల్గొన్నారు.