హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తెలంగాణ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ సాగర్ చెప్పారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5 నుంచి 11 వరకు గ్రామాల్లో మోదీ, ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్టు తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యక్షుడు అరిబండి ప్రసాద్రావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
భారత ప్రయోజనాలను అమెరికాకు మోదీ తాకట్టు పెట్టారని చెప్పారు. ‘దిగుమతులపై సుంకాలను తొలగించడం వల్ల భారత మారెట్లోకి అమెరికా వస్తువులు వెల్లువెత్తుతాయి. దీంతో మన కార్మికులకు ఉపాధి దొరకదు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఒప్పందం ప్రభావం ఎక్కువగా ఉంటు ంది. దీనిపై పార్లమెంట్లో చర్చించాలి’అని సాగర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతే తమ లక్ష్యమని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా చెప్పారు. ‘మహిళా ఆధారిత ఎలక్ట్రిక్ మొబిలిటీ’ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి వీవీసీ మోటార్స్తో బుధవారం హైదరాబాద్లో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో 500 మంది మహిళలను ఎంపిక చేసి వారిని ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.