మా ధాన్యం సర్కారే కొనాలి.. నవ నిర్మాణ్ కిసాన్ సభ డిమాండ్.. 10 వేల మందితో పాదయాత్ర
ధన్మండల్ వద్ద అడ్డుకున్న పోలీసులు.. భువనేశ్వర్లో నిరసన తెలుపుతామంటూ రైతుల పంతం
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా ప్రవేశపెట్టాలని నవ నిర్మాణ్ కిసాన్ సభ అధ్యక్షుడు అక్షయ్కుమార్ డిమాండ్చేశారు. రైతు సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న డిమాండ్తో ఒడిశాలో అక్షయ్కుమార్ ఆధ్వర్యంలో 10 వేల మంది రైతులు పాదయాత్ర చేపట్టారు. ఒడిశాలోని జాస్పుర్ జిల్లా నుంచి భువనేశ్వర్కు పాదయాత్రగా బయలుదేరిన రైతులను గురువారం ధన్మండల్ పట్టణంలో పోలీసులు అడ్డుకొన్నారు.
ఈ పాదయాత్రకు సౌత్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్ చైర్మన్ కోటపాటి నరసింహనాయుడు, వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. పాదయాత్రను అడ్డుకోవడంతో ధన్మండల్ రైల్వేస్టేషన్కు పెద్దసంఖ్యలో రైతులు చేరుకొన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి తెలంగాణ పథకాలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. సాగునీరు మొదలు రైతుబంధు వరకు ఎన్నో అద్భుతమైన పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని నినదించారు. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్న రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ భువనేశ్వర్ చేరుకొంటామని పట్టుపడుతున్నారు. శుక్రవారం మరో 5 వేల మంది రైతులు పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.
ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, తెలంగాణలో నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ఒడిశాలో కూడా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనాలని డిమాండ్చేశారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అక్షయ్కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే అధ్యయనం చేశారు. తెలంగాణ అమలుచేస్తున్న పథకాలతోనే రాష్ట్ర ప్రజలు సంపన్నులు అవుతున్నారని కితాబిచ్చారు.