సగటు హైదరాబాదీలు నారాజ్ కారెప్పుడు. చోడ్ దో యార్ వారి సిద్ధాంతం. దమ్ కీ ఇచ్చినోన్ని.. అలాయ్ బలాయ్తో ఖుషీ చేసేయగలరు. దమ్ కీ బిర్యానీ ఆఫర్ చేసే దమ్మున్నోళ్లు. ఎంత లాఫర్వాగా ఉన్నా.. పర్సో పరేషాన్లను మర్చిపోయే అమాయకులూ కారు. నగరానికి దశాబ్దాలపాటూ కాంగ్రెస్ చేసిన గాయాలను తమలోనే దాచుకున్నారు. పుకార్లతో పాతబస్తీని ఆగం పట్టించిన వారి వైఖరులను ఇప్పుడు యాది చేసుకుంటున్నారు. కర్ఫ్యూలప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో చార్మినార్ సాక్షిగా చెబుతున్నారు.
కాంగ్రెస్ హయాంలో కల్లోలానికి మారుపేరుగా ఉన్నపాతబస్తీ ఈరోజు మురిసిపోతున్నది. తెలంగాణ రాకతో రాజధాని నసీబు మారింది. కర్ఫ్యూజాడలు కనుమరుగయ్యాయి. విశ్వవేదికపై బేమిసాల్ నగరంగా హైదరాబాద్ కీర్తి గడించింది. పాతబస్తీ ప్రశాంతతే ఇందుకు తార్కాణం. ఆ ముచ్చటేందో.. షహర్ కీ షాన్ చార్మినార్ నీడలో వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న అజబ్ దోస్తులు చెబుతున్న గజబ్ ముచ్చట్లు చదివేస్తే మీకూ అర్థమవుతుంది.
షాబుద్దీన్ ఖురేషీ (వీధి వ్యాపారి): భాయ్! ఆళ్లు గెలుస్తరని, ఈళ్లు గెలుస్తరని సర్వేలొస్తున్నయ్. ఇయ్యన్నీ నిజమేనా?
సయ్యద్ ముఖర్రం (వీధి వ్యాపారి): ఇయన్నీ పుకార్లే.
డా॥ నాగ్నాథ్ (భవానీ జ్యువెలర్స్): ఓల్డ్ సిటీల పుకార్ల సంగతి మనకు తెల్వదా! 1968లో చార్మినార్ మునిగిందని పుకారు లేచింది. ఎక్కడ వరద వస్తుందో అని మేముంటున్న ఘాన్సీ బజార్లో అందరం పరేషాన్ అయినం. దుకాణాలు మూయకుండానే కొందరు పరుగందుకున్నరు. రోడ్డు మీదికొస్తే.. ఒక్క చినుకు లేదు. గిట్ల పుకార్లు నమ్ముతరేందిరా బై.. అనుకుంట పోయిన! కొందరు పబ్లిక్ను భయపెట్టనీకి.. అటు ఫైరింగ్ అని, ఇటు ఫైరింగ్ అని పుకార్లు లేపేది. గవన్ని నమ్మి ఎంతమంది ఆగమైనరో తెల్వదా!
ఎం.డి. షరీఫ్ (కరీం బ్యాంగిల్స్ స్టోర్): అవును! అప్పటి పుకార్ల కన్నా.. నిజాలే భయంకరంగా ఉంటుండే! ఎన్ని ఘోరాలు చూసినమో ఈ కండ్లతోని. ఎప్పుడేమైతదో తెల్వకపోవు. 1969 జులూసప్పుడు ఇంటికి పోతుంటే పోలీసోళ్లు అట్కాయించి ఫుల్లు కొట్టిన్రు. సిటీల ఎక్కడ లొల్లయినా దొరికినోళ్లను దొరికినట్టు కొడ్తుండే! కొట్లాటలు, బంద్లు, కర్ఫ్యూలు దినామ్ ఏదో పరేషానే ఉంటుండే!
నాగ్నాథ్: నేను గసొంటి దెబ్బలు వందలు తిన్న. 1969 టైమ్ల మా ఇల్లు ఘాన్సీబజార్లో ఉంటుండే. సిటీ కాలేజ్ నుంచి స్టూడెంట్ ర్యాలీ పోతుంటె పోలీసోళ్లు అడ్డం తిరిగిన్రు. పోరగాళ్లను చితక్కొట్టిన్రు. నడవనీకి రావొద్దని మోకాళ్ల మీద కొడుతుండే. మా ఇంట్ల పెట్టుకోని వందమంది దాంక స్టూడెంట్స్ని నుంచి కాపాడిన.
షరీఫ్: గీ బందులతోని తిండికి మస్తు తిప్పలయ్యేది. కొనేటోళ్లు రాకపోతే మన బతుకు ఎట్ల నడుస్తది చెప్పుండి. అంత సక్కగుంటనే ఏదో తినేటోళ్లం అన్నట్టుండేది. గసొంటిది బందులొచ్చినయంటే ఒక్కపూట తినుడే కష్టమైతుండే!
నాగ్నాథ్: పాతబస్తీని కాంగ్రెస్ టైమ్ల అల్లర్లకు కేరాఫ్ చేసిన్రు. 1969 లొల్లి మర్సిపోకముందే.. 1972 జై ఆంధ్ర అని మళ్లీ తగులుకున్నరు. అప్పుడు.. చార్కమాన్, మిత్తీ కా షేర్ చౌరాస్తా దగ్గర టియర్ గ్యాస్ కొట్టిన్రు. పోరగాళ్లను ఉరికిచ్చి కొట్టిన్రు. పత్తర్గట్టిలో ఫైరింగ్ అయిందప్పుడే.
రవి కుమార్ (టూరిస్ట్ గైడ్): ఆ జమానలనే గాదు, మా అప్పుడూ పాతబస్తీ అంటే గొడవలే ఉంటుండె. నేను టెన్త్ చదివేటప్పుడు 25 రోజులు కర్ఫ్యూ ఉండె. అది ఎత్తేసిన తర్వాత భయమే. సగం రోజులు గూడ బడులు ఉండేది గాదు. సగం సదువులతోని పరీక్షలు రాస్తే ఫెయిలైన. నా లెక్కనే పాతబస్తీల చానామంది సదువులు ఆగమైనయ్.
షరీఫ్: ఇంటి నుంచి ఇస్కూల్కి పోతున్నప్పుడు ఉన్న సక్కదనం.. మళ్లీ వచ్చేటప్పుడు ఉండకపోవు. 144 సెక్షనైతే కామన్ ఉంటుండే. అప్పట్ల పోరగాళ్లు ఇంటికి వచ్చేదాంక భయమే! పిల్లలొచ్చుడు జర్రంత లేటైనా గాబరా అయితుండే! భయపడుతూ బతకడం మనకు అలవాటైంది.
నాగ్నాథ్: బంద్లు, కర్ఫ్యూలతోని చానామంది వ్యాపారులు నష్టపోయిన్రు. కట్టెలు, టైర్లు రోడ్ల మీద కాల్చేది. గా టైమ్ల ఎవడు బయటికొస్తడు. ఎవడు షాపింగ్ చేస్తడు. షాప్లన్నీ బంద్ ఉంటుండే. కొంతమంది వ్యాపారాలే వదులుకున్నరు. 1968లో లాడ్ బజార్ లూటీ అయింది. రెండేండ్లకోసారి పెద్దపెద్ద అల్లర్లయితుండే. రమీజాబీని చంపినప్పుడు నెలలు ఇంట్లనే ఉన్నం.
రవి కుమార్: సదువు సరిగా లేక నేను చార్మినార్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ లెక్క జేరిన. 2007లో మక్కా మసీదుల బాంబులు పేలినయ్. అప్పటికి నా పెండ్లయి అయిదు రోజులు కాలే. పెండ్లి కోసం పది రోజులు సెలవు తీసుకున్న. కానీ, ఆరో రోజే.. ‘ఇగ సెలవుల్లేవ్. డ్యూటీకి రావాలి’ అని పిలుపొచ్చింది. ఉద్యోగం కావాలె. కాబట్టి సచ్చినట్టు వచ్చి చేరిన. అట్లుంటుండే మన దరిద్రం.
నాగ్నాథ్: 1984ల కర్ఫ్యూ.. మా ఆవిడకు పురిటి నొప్పులు మొదలైనయ్. రాత్రిపూట దవాఖానకు బయలుదేరినం. ఆటోలు బంద్. పాడైన రిక్షాకి పంచర్లేయించి తీస్కపోతుంటె… పోలీసోళ్లు ఆపి, ఎవరు మీరు? ఏడికి పోతున్నరని అడిగినరు. అడిగినోళ్ల కల్లా బాధలు చెప్పుకుంట పోయినం. పాతబస్తీ గిట్ల నిమ్మలమైతదని కలల గిన ఊహించలే!
రవి కుమార్: తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. పోలీసు డిపార్ట్మెంట్ని ఇంప్రూవ్ చేసిండు. ఓల్డ్ సిటీల క్రైమ్ తగ్గింది. అప్పట్ల (2014కి ముందు) ఉన్నట్టు గొడవల్లేవ్. బందుల్లేవ్. కాబట్టే టూరిజం బాగుంది. లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెట్టినాంక టూరిస్టులు పెరిగినరు.
ముఖర్రం ఇక్బాల్ (మినార్ బుక్స్): ఇంతకుముందు దుబాయ్ల ఉండే బంధువులు ఫోన్ జేస్తే జాగ్రత్తగా ఉండమని చెప్పేది. ఇప్పుడు వాళ్లే అరె.. హైదరాబాద్ భలే మారిపోయిందే అంటున్నరు.
సయ్యద్ ముఖర్రం: ఇప్పుటి పిల్లలకు కర్ఫ్యూ ఎట్లుంటదో తెల్వది. అంత మంచిగున్నం. మల్లా ఆగమైతే బతుకులు ఎన్కకి పోయినట్టే.
షరీఫ్: ఇప్పుడు సిటీ పీస్ఫుల్ ఉంది. మస్త్ డెవలపైంది. ఏ గొడవల్లేవ్. హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరం భాయి భాయి అనుకుంట ఖుషీగా బతుకుతున్నం.
నాగ్నాథ్: పాతబస్తీకి పాతబాధలు మాయమైనయ్. వ్యాపారం బాగుంది. గల్లీ గల్లీకి వ్యాపారాలు అచ్చినయ్!
షాబుద్దీన్ ఖురేషీ: దునియా ఎట్ల మారిందో తెల్వద్ గని, హైదరాబాద్ మాత్రం మస్త్ మారిపోయింది. కేసీఆర్ చానా మంచిగ జేసిండు. మంచి చేసినోడిని యాది జేసుకోవాలె.
రవికుమార్: కేసీఆర్ చెప్పేది నిజమే. అరవై ఏండ్లల్ల చేయని పనులు పదేండ్లల్ల చేసిండు. ఇక్కడ పెడస్ట్రియల్ కారిడార్ పనులు ఆగిపోయినయ్. అప్పటి ముఖ్యమంత్రులు ఎక్కడి పనులు అక్కడే వదిలేసిన్రు. కేసీఆర్ సీఎం అయినాంకనే అన్నీ జరిగినయ్. ఇప్పుడు చార్మినార్ శుభ్రంగా ఉంది.
ముఖర్రం ఇక్బాల్: కాంగ్రెసొస్తే.. మళ్లీ పరేషానే! వారానికి మూడు కొట్లాటలైతయ్. మన బతుకులు ఆగమైతయ్.
షాబుద్దీన్: కేసీఆర్.. అందరినీ ఒక్క తీరుగ జూసుకుంటున్నడు. ఎవరికి ఏం తక్కువ జేసిండు? మళ్లీ కేసీఆరే వస్తడు. కాంగ్రెస్ రాదన్న.. గిదైతే పక్కా! ఆ పార్టీ గెలవాల్నంటె కేసీఆర్ లెక్క కష్టపడాలె. అట్ల పని చేసుడు ఆల్లకు చాతకాదు. జీతే రహో కేసీఆర్!!
…? నాగవర్ధన్ రాయల
– వీరగోని రజనీకాంత్ గౌడ్