హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): థాయ్లాండ్ నుంచి భారత్లోని పలు నగరాలకు అక్రమంగా హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టయింది. ఈ నెట్వర్క్తో 96 మందికి సంబంధం ఉన్నట్టు తెలంగాణ ఈగల్ ఫోర్స్ గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన 60 మంది రవాణాదారులకు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద నోటీసులు జారీ చేసినట్టు శనివారం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ ప్రయాణికుడిగా ఏప్రిల్ 7న శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సోదా మొహ్సీన్ బహదూర్ భాయ్ లగేజీలో 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది.
దీనిపై కస్టమ్స్ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ సిబ్బంది.. ఈ నెల 8న హైదరాబాద్లోని రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్లో సందీప్ జయప్రకాశ్, హర్షద్ మన్సుఖ్ భాయ్ ప్రజాపతిని అదుపులోకి తీసుకుని 12.739 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న హేమాంగ్ ప్రమోద్ కులేసర్, మరో 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా థాయ్లాండ్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్, ముంబై, గుజరాత్, కోల్కతా తదితర నగరాలకు తరలిస్తున్నట్టు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది.