హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికుల ఇండ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు బెల్ట్ ప్రాంతంలోని ఇండ్ల స్థలాల సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం చూపుతూ అర్హులైన కుటుంబాలకు హక్కు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను హైకోర్టు ఆదేశాలకు లోబడి 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి, జిల్లా రిజిస్ట్రార్ సభ్యులుగా ఉంటారని తెలిపారు.
క్యూర్ పరిధిలో 21వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో 21వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేశామని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్బెడ్ రూమ్ ఇండ్లకు ఈ నెల 30లోగా డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఆన్లైన్ పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్బెడ్ రూమ్ ఇండ్లు ఉన్న ప్రాంతానికి 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారినే ఎంపిక చేయాలని సూచించారు.