హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. త్వరలోనే పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి, ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ)కి అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే గోదావరి బేసిన్ ప్రాజెక్టుల డీపీఆర్లన్నీ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి సమర్పించామని వివరించారు. ఇరిగేషన్కు సంబంధించి అన్నివిభాగాల ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లతో ఎర్రమంజిల్లోని జలసౌధ నుంచి రజత్కుమార్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా విభాగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పనుల పురోగతి, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ ఎం) విభాగం పరిధిలో దాదాపుగా 1500ల కు పైగా పనులను మంజూరు చేశామని రజత్కుమార్ వెల్లడించారు. ప్రాజెక్టులు, కాలువ లు, తూముల మరమ్మతు పనులను జూన్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. గడువులోగా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వానకాలం సీజన్కు ముందు లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకూ ప్రతివారం రెండు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించాలని, క్రమం తప్పకుండా పనులను సందర్శించాలని ఆదేశించారు. మైనర్లు, ఫీల్డ్ చానెల్లు, ఇతర సాధ్యమయ్యే పనుల మరమ్మతులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, నాగేందర్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, మైనర్ ఇరిగేషన్ ప్రభుత్వ సలహాదారు విజయ్ప్రకాశ్, పలువురు సీఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.