హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ముందంజలో నిలిచాయి. ఫైవ్, ఫోర్ స్టార్ క్యాటగిరీల్లో ఫిబ్రవరి మాసానికి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలు అగ్రభాగాన ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన డయ్యూడామన్, దాద్రానగర్ హవేళికి చెందిన జిల్లాలు మాత్రమే తెలంగాణతో పోటీపడగా, మిగిలిన రాష్ర్టాలు మనకు సమీపంలో కూడా లేవు.
ఫోర్ స్టార్ రేటింగ్లో పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలు 3,5వ స్థానంలో నిలిచాయి. త్రీస్టార్ రేటింగ్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 6వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్కు సంబంధించి ఆయా జిల్లాల పనితీరు, కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలు పాటించిన జిల్లాలకు ప్రతి నెలా ర్యాంకులు కేటాయిస్తున్నారు. వన్ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ వరకు విభజిస్తూ ప్రతినెలా 1న ర్యాంకులు ప్రకటిస్తుండగా, రెండురోజుల క్రితం త్రైమాసికం ర్యాంకులను కేంద్రం కేటాయించింది.