CM KCR | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అస్థిత్వాన్ని ప్రతిబింబించేలా లోగోను రూపొందించింది. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో సీఎం కేసీఆర్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దేశానికే రోల్మాడల్గా నిలిచిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయం, 125 అడుగుల అంబేదర్ విగ్రహం చిహ్నాలను మేళవించి సీఎం ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు.
వీటితోపాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్థిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో రూపుదిద్దుకొన్నది. కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, బాల సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.