హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగు లాంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం గవర్నర్ వ్యవస్థను ఒక సాధనంగా వాడుకొంటున్నదని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మతో కలిసి గురువారం హైదరాబాద్ మగ్దూం భవన్లో కూనంనేని మీడియాతో మాట్లాడారు.
తమిళనాడు, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీలో గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కేంద్రం యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవస్థ వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఉన్నాయని, అదొక అపెండెక్స్ లాంటిదని, రాజ్యాంగం మరింత పరిఢవిల్లాలంటే గవర్నర్ వ్యవస్థను సవరించాలని సూచించారు. గవర్నర్ వ్యవస్థ రద్దుకు పోరాడుతున్నందునే ‘ఎట్హోం’ కార్యక్రమాన్ని బహిష్కరించినట్టు చెప్పారు.
ప్రభుత్వ పాపాలను వామపక్ష పార్టీలు భరించాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కూనంనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపోరాటాల్లో పోలీసులు మాపై కేసులు నమోదు చేశారని, ఆ కేసుల్లో కాంగ్రెస్ భాగస్వామ్యం తీసుకొంటుందా? అని ప్రశ్నించారు. కొన్ని అంశాల్లో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని, తమకు భాగస్వామ్యం ఉన్నట్టయితే పేదలకు ఇండ్లు ఇప్పించేవాళ్లమని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేవాళ్లమని చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత తనతోపాటు పల్లా వెంకట్రెడ్డిపై కూడా కేసులు నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ తన వ్యాఖ్యలను వెనకి తీసుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు.
రేవంత్ కండ్లకు కనిపించడం లేదా: చాడ
రేవంత్రెడ్డి రాజకీయంగా ఎలా మాట్లాడాలో పరిజ్ఞానం పెంచుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి సూచించారు. కమ్యూనిస్టులు ఎవరి పక్షపాతులు కాదని, ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చినప్పటికీ ‘బారా ఖూన్ మాఫీ’ ఉండబోదని స్పష్టం చేశారు.
2004లో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భూ పోరాటాలు చేశామని, ఖమ్మం జిల్లాలో ఏడుగురు మరణించారని గుర్తు చేశారు. పేదల పక్షాన సీపీఐ చేస్తున్న పోరాటాలు రేవంత్ కండ్లకు కనిపించడం లేదా? అని మండిపడ్డారు. ఎన్నికల పొత్తులు వేరు, ప్రజా సమస్యలు వేరు అన్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం ఒకటి కూడా నెరవేర్చలేదని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.