CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘జంగల్ బచావో.. జంగల్ బడావో’ నినాదాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఆ దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు సీఎం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని ఊహించలేమని, అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నామని వెల్లడించారు. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించడంతో అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగిల్లో కూడా ఉహించలేనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్సిటీ అవార్డు-2002 దక్కిందని గుర్తుచేశారు. అభివృద్ధి ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయమని స్పష్టంచేశారు. పర్యావరణపరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ దుష్ప్రభావాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు. మనతోపాటు భవిష్యత్ తరాలు కూడా పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని తెలిపారు. ఈ దిశగా అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని చెప్పారు. హరిత తెలంగాణ కోసం లక్షిత పచ్చదనం 33% సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయమని పేర్కొన్నారు.
అమరవీరులను స్మరించుకుందాం:ఎంపీ సంతోష్కుమార్
అడవులను, వన్యప్రాణులను కాపాడుతూ తమ ప్రాణాలను త్యజించిన అటవీ అమరవీరులను స్మరించుకుందామని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత, పర్యావరణానికి వారు చేస్తున్న కృషి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ట్వీట్ చేశారు.