Bhatti Vikramarka | యాదాద్రి భువనగిరి, మార్చి 11 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. ప్రొటోకాల్లో సీఎం తర్వాతి హోదా కలిగిన డిప్యూటీ సీఎం స్థాయిని కించపరిచేలా క్యాబినెట్ మంత్రుల కన్నా తక్కువస్థాయిలో కూర్చోబెట్టారు. మరో క్యాబినెట్ మంత్రి కొండా సురేఖకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. సాక్షాత్తూ దేవాదాయశాఖ మంత్రి అయిన సురేఖను కూడా అగ్రవర్ణ మంత్రుల కన్నా తక్కువస్థాయిలో కూర్చోబెట్టారు. జరిగిన అవమానంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగాయి. ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. యాదగిరిగుట్టపై మహా ఉద్ఘాటన తర్వాత రెండో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులను ఆలయ అధికారులు ఆహ్వానించారు. రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం ఆలయాన్ని సందర్శించారు.
ప్రధానాలయంలో పూజలు, పట్టువస్ర్తాల సమర్పణ తర్వాత సీఎం, మంత్రులకు వేదపండితులు ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కూర్చునేందుకు ఆలయ అధికారులు కుర్చీలు వేశారు. డిప్యూటీ సీఎం భట్టి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను మాత్రం చిన్నపీటలపై కూర్చోబెట్టారు. ఇది వివాదానికి కారణమైంది. దళిత, బీసీ సామాజికవర్గాలకు చెందిన భట్టి, సురేఖకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన మొదలైంది. ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, దళిత, బీసీ సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. వివాదంపై స్పందించిన ఆలయ అధికారులు మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం కోసం వేసిన కుర్చీల్లో ఇతర మంత్రులు కూర్చోవడం వల్ల అప్పటికప్పుడు వేరే ఆసనాన్ని తెప్పించినట్టు పేర్కొన్నారు. మరోవైపు, నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించిన భట్టి ఫొటోలు, ఇటీవల ఆయన ఫొటో లేకుండానే జారీచేయడం కూడా వివాదాదస్పదమైంది.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ విషయంలో ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్, ఇతర అధికారులు కచ్చితంగా ఉంటారు. అలాంటిది ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్నప్పుడు ప్రొటోకాల్ విషయంలో గందరగోళం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. అయితే, తాజా ఘటనలో మాత్రం ప్రొటోకాల్ను పక్కనపెట్టి ఒక సామాజిక వర్గానికే మర్యాదలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, టీసీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్కు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. దళితులను బీఆర్ఎస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసని మండిపడ్డారు.
యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరిగిందంటూ వస్తున్న విమర్శలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పందించారు. ఆలయంలో భట్టికి కూడా కుర్చీ వేశారని, ఆయన కుర్చీ చిన్నగా ఉండడం, మిగతా కుర్చీలు పెద్దగా ఉండడం వల్ల డిప్యూటీ సీఎం కింద కూర్చున్నట్టుగా కనిపించిందని వివరణ ఇచ్చారు. ముందుగా వచ్చిన మంత్రులు ముందుగా కూర్చోవడం, చివరన వచ్చిన మంత్రులు చిన్న కుర్చీల్లో కూర్చోవడంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. మల్లు భట్టి విక్రమార, మంత్రి కొండా సురేఖను అవమానించినట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదన్నారు. అందరికీ సమానంగా గౌరవించామని, కేటాయించిన సీట్లు హెచ్చుతగ్గుగా ఉండడం వల్ల దానిని లోపంగా చూస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.