హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్ చొరవ అభినందనీయమని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఎలాంటి కార్యాచరణకైనా తాము సిద్ధమని జేఏసీ చైర్మన్ కోడూరి ప్రకాశ్, కన్వీనర్ ఎన్ శివాజీ ప్రకటించారు. అసెంబ్లీలో విద్యుత్తు బిల్లు పర్యవసానాలపై చర్చ నేపథ్యంలో జేఏసీ నేతలు సోమవారం విద్యుత్తు సౌధలో అత్యవసరంగా సమావేశమయ్యారు. రైతు వ్యతిరేక, అప్రజాస్వామిక, ఉద్యోగ వ్యతిరేక బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఎండగట్టడంతో తమ ఉద్యమానికి నైతిక మద్ధతు లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడినట్టుగానే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న విద్యుత్తు వ్యవస్థను ఇద్దరు, ముగ్గురు కార్పొరేట్ శక్తులకు అంటగట్టే ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. జేఏసీ నేతలు రామేశ్వరయ్యశెట్టి, తుల్జారాంసింగ్, గణేష్రావు, వినోద్కుమార్, నాజర్షరీఫ్, జాన్సన్, కరెంట్రావు, రమేష్, విజయ్, ఆరోగ్యరాణి, బందెల రవి, మాతంగి శ్రీనివాస్, ఈఎల్పీ రాజు తదితరులు పాల్గొన్నారు.