హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాధారణ ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళికకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని, వారు నిర్ణయించే తేదీలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు అవసరమవుతాయని, వాటిని ఎక్కడ వినియోగించాలనే దానిపై పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటినీ పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
శనివారం బీఆర్కేఆర్ భవన్లో అదనపు సీఈవో లోకేశ్కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్రెడ్డి, డిప్యూటీ సీఈవో సత్యవాణితో కలిసి మీడియా సెంబర్ను వికాస్రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కోసం మే చివరి వారం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు శిక్షణలు పూర్తి చేశామని, ఈవీఎంల పరిశీలన కూడా పూర్తైందని వెల్లడించారు. మరో రెండుసార్లు ఈవీఎంలను పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటివరకు 15 లక్షల మంది కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని వికాస్రాజ్ వెల్లడించారు. ఓటు నమోదు కోసం సాధారణ ఎన్నికల నామినేషన్ చివరి తేదీవరకు గడువు ఉంటుందని తెలిపారు. ఓటరు జాబితా తొలగింపు, కొత్త ఓటర్ల సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చినట్టు చెప్పారు. ఓటరు జాబితా అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా మీడియా సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు.
వచ్చే నెల 3 నుంచి 5వరకు సీఈసీ పర్యటన
రాష్ట్రంలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారని వికాస్రాజ్ చెప్పారు. రాజకీయ పార్టీలు, ఎన్ఫోర్స్మెం ట్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. 20 శాఖల కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులతోనూ సమావేశమవుతారని తెలిపారు. ఈసీ అధికారుల పర్యట న అనంతరం.. వారి సూచనలకు అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
దివ్యాంగులకు అదనపు వెసులుబాటు
రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది దివ్యాంగులను అదనంగా ఓటర్లుగా నమోదు చేశామని వికాస్రాజ్ తెలిపారు. 80 ఏండ్లకు పైబడిన వారు, దివ్యాంగులు ఇంటినుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, కౌంటింగ్ సెంటర్లు అన్నింటిని గుర్తించే పని కొనసాగుతున్నదని తెలిపారు. వీటిపై జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.