Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నది. శనివారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల ఊసే ఎత్తలేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు రాష్ర్టానికి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చాయి. అనేక అవార్డులను సాధించిపెట్టాయి. అలాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
ఆ పథకాల పేర్లను సైతం బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. వాటికి కనీసస్థాయిలో కూడా కేటాయింపులు చేయలేదు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామం శుభ్రంగా, పరిశుభ్రంగా మారింది. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, డంపింగ్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టారు. పట్టణ ప్రగతిలోనూ పచ్చదనం, పారిశుద్ధ్యం, వాహనాలు, ఎఫ్ఎస్టీపీ, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించారు. మున్సిపాలిటీలు సైతం అనేక అవార్డులు దక్కించుకొన్నాయి. ఇంతటి ఖ్యాతికి కారణమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కాంగ్రెస్ సర్కారు నిధులు కేటాయించకపోవడం గమనార్హం.
దళితజాతి సముద్ధరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్తం పేరిట దళితులతోపాటు గిరిజనులకు సైతం రూ.12 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. తాజాగా ప్రకటించిన బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకుండా పోయింది. ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ. 21,874 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.13,313కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.8 వేల కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.2,262 కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు సొంతభవనాల నిర్మాణం కోసం రూ.2,746 కోట్లు ప్రతిపాదించింది. గురుకుల పాఠశాలల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపినట్టు వెల్లడించింది.