హైదరాబాద్, మే 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్.. వివేకానంద విదేశీ విద్యాపథకం కింద లబ్ధిదారులకు గురువారం మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ విద్యాసంవత్సరానికి 133 మంది విద్యార్థులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.
తెలంగాణ సారస్వత పరిషత్ హాలులో ఉదయం పది గంటలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి చేతులమీదుగా మంజూరు పత్రాలను ప్రదానం చేయనున్నట్టు టీబీఎస్పీ పాలనాధికారి రఘురామశర్మ తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీబీఎస్పీ ఉపాధ్యక్షులు వనం జ్వాలా నరసింహారావుతోపాటు సంక్షేమ పరిషత్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పేద బ్రాహ్మణులను ఆదుకొనే ఉద్దేశంతో ప్రభుత్వం బ్రాహ్మణ వర్గానికి కూడా విదేశీ విద్యా పథకాన్ని 2017నుంచి అమలుచేస్తున్నది. 2021-22 విద్యాసంవత్సరం వరకు 476 మంది ఈ పథకం ద్వారా లబ్దిపొందారు. ప్రస్తుతం 235 మంది దరఖాస్తు చేయగా, అందులో 133 మంది అర్హులను ఎంపికచేశారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.