హైదరాబాద్: ‘వివేకానంద విదేశీ విద్య’ పథకం కింద 2022-23 సంవత్సరానికి అర్హులైన బ్రాహ్మణ విద్యార్థుల నుంచి తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ పథకం బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో వృత్తిపరమైన, ఇతర ఉన్నత విద్యాకోర్సులను అభ్యసించటానికి వీలు కల్పించేందుకు ఉద్దేశించినది. జనవరి 5 వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వ తేదీ వరకు www.brahminparishad.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదవి, సరైన ధ్రువపత్రాలు జతపరచాలని పేర్కొన్నది. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోవాలని పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి కోరారు. ఎంపికయ్యే వారు రూ.20 లక్షలకు మించకుండా బోధనా రుసుము (ట్యూషన్ ఫీజు) పొందవచ్చని ఆయన తెలిపారు.