హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు చేస్తున్న కృషిని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ అభినందించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్తో కూడిన ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీలో యూజీసీ చైర్మన్తో సమావేశమైంది. త్వరలో నిర్వహించనున్న వీసీల స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా రావాలని యూజీసీ చైర్మన్ను ఆహ్వానించింది. ఈ సందర్భంగా యూజీసీ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గుర్తింపు లేని విద్యాసంస్థలన్నీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించిన ప్రొఫెసర్ లింబాద్రి.. పరిశోధన, బోధనా కార్యక్రమాలకు యూజీసీ మద్దతు ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు సాలర్షిప్లతో పాటు పరిశోధన, విస్తరణ కార్యకలాపాల కోసం విశ్వవిద్యాలయాలకు మరిన్ని నిధులు అందించాల్సిన అవసరం ఉన్నదని వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ, బీకాం హానర్స్ తదితర కోర్సుల గురించి వీసీ రవీందర్ వివరించారు. అనంతరం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో జరుగుతున్న కృషిని ఆయనకు వివరించారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించే పరిశోధన కార్యకలాపాలకు సహకారం అందిస్తానని శ్రీవారి చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. సామాజిక న్యాయ, సాధికారిత విభాగం కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యంను కలిసి రాష్ట్రంలో పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాల నిర్వహణ, మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయాల కల్పనకు తోడ్పాటు అందించాలన్నారు.