హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): అధునాతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవటంలో, అభివృద్ధి చేయటంలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చైన్, డ్రోన్స్ అండ్ రోబోటిక్స్, ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్టెక్, క్లౌడ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ (ఏఆర్ అండ్ వీఆర్), త్రీడీ ప్రింటింగ్ తదితర సాంకేతికతలకు రాష్ట్రం కేంద్రంగా మారుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దిగ్గజ టెక్ కంపెనీలతోపాటు స్టార్టప్లు కూడా అత్యాధునిక సాంకేతికతలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర ఐటీ నివేదిక – 2021-22లో స్పష్టమైంది. కీలకాంశాలు ఇలా ఉన్నాయి…
ఈ -లావాదేవీల్లో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అగ్రిగేషన్ అండ్ అనాలసిస్ లేయర్ వెల్లడించింది. మన దగ్గర ప్రతి వెయ్యి మందికి 1,39,524 ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 600కు పైగా సర్వీస్లు, 100కు పైగా ఏజెన్సీలు, 4,500కు పైగా మీ సేవా కేంద్రాలున్నాయి. యాప్లు, మీ సేవా పోర్టల్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 2.6 కోట్ల ప్రజలకు ఇవి సేవలందిస్తున్నాయి.
పరిపాలనలో సంస్కరణలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక విభాగాల్లో ఎలక్ట్రానిక్ ఆఫీస్ విధానాన్ని అనుసరిస్తున్నది. 30 సచివాలయ శాఖలు, 113 హెచ్వోసీలు, పురపాలికలు, 33 జిల్లాలు, 137 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 56 పాలిటెక్నిక్లలో కాగిత రహిత పాలన అమలుచేస్తున్నారు. త్వరలోనే మండలస్థాయి వరకు దీనిని విస్తరించనున్నారు. ఉస్మానియా, జేఎన్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీల్లో ఈ ఆఫీస్ ప్రక్రియ వేగవంతమైంది. సింగరేణి కాలరీస్, హైకోర్టు కోసం ప్రత్యేకంగా ఈ ఆఫీస్లను రూపొందించారు.
ఔత్సాహిక మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వీ-హబ్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 67 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు వీ-హబ్ తోడుగా నిలుస్తున్నది.
టైర్-2, టైర్-3 నగరాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ-హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు 354 మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది. రూరల్ ఇంక్యుబేషన్ ద్వారా 17 మంది మహిళలకు అండగా నిలిచింది. మాడల్ మున్సిపాలిటీ ప్రాజెక్ట్ ద్వారా రామగుండం మున్సిపాలిటీ పరిధిలో 166 మంది మహిళలకు రూ.7.39 కోట్ల రుణాలు ఇచ్చింది. ట్రైకార్ ఇంక్యుబేషన్ ప్రొగ్రాం ద్వారా 93 మందికి రూ.5.09 కోట్ల రుణాలిచ్చింది. కరీంనగర్ జిల్లాల్లో దళితబంధు ద్వారా 790 మందికి ఈడీపీ శిక్షణ ఇవ్వగా, 174 మంది వ్యాపారాలు ప్రారంభించారు.