హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): శాసససభ శుక్రవారం నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపించడంతో తిరిగి వాటిని సభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర పాలక సంస్థల్లో కోఆప్షన్ సభ్యుల సంఖ్య 5 నుంచి 15కు పెంపు, వైద్య ప్రొఫెసర్ల పదవీకాలం పొడగింపు, ప్రైవేటు వర్సిటీల బిల్లు, భద్రాచలం జీపీని కొత్తగా మరో 2 జీపీలుగా ఏర్పాటుచేయడం సహా నాలుగు బిల్లులకు నిరుడు సెప్టెంబర్లో ఉభయ సభలు ఆమోదించినా గవర్నర్ వాటిని తిప్పి పంపించారు.
ఈ నేపథ్యంలో ఆయా బిల్లులను మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సబిత, ఎర్రబెల్లి సభలో ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే ముఖ్యమని హరీశ్రావు పేర్కొనగా, బిల్లులను గవర్నర్ తిరిగి పంపించడంలో రాజకీయ కోణం తప్ప పెద్దగా ఏమీ లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాగా, అసెంబ్లీ దాదాపుగా 12.30 గంటలు సాగింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు సుదీర్ఘంగా నడిచింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, వరదలు, విద్య, వైద్యంపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు.