హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): తెలంగాణను విత్తనరంగంలో ‘గ్లోబల్ సీడ్ హబ్’గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) అధ్యక్షుడు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు తెలిపారు. ‘సీడ్బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన తెలంగాణ ఇప్పటికే వివిధ దేశాలకు నాణ్యమైన విత్తనాలను ఎగుమతి చేస్తున్నదని చెప్పారు. కేశవులు ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయన ఆధ్వర్యంలో తొలి గవర్నింగ్ బోర్డు సమావేశం ఆదివారం అమెరికాలోని వాషింగ్టన్లో జరిగింది. సమావేశంలో 83 దేశాలకు చెందిన విత్తనరంగ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు నాణ్యమైన విత్తనాల సరఫరా, ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించి నాణ్యమైన విత్తనాలను అందించడంలో ఇస్టా పాత్రను చర్చించారు. ఈ సమావేశంలో కేశవులు మాట్లాడుతూ.. తెలంగాణలోని విత్తన కంపెనీలు ఇతర రాష్ర్టాలు, వివిధ దేశాలకు చేస్తున్న ఎగుమతుల గురించి వివరించారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టులపై వివిధ దేశాలకు చెందిన విత్తన శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు ప్రశంసలు కురిపించారు.
అత్యధిక దేశాల రైతులకు ఇప్పటికీ నాణ్యమైన విత్తనాలు అందకపోవడంపై ఇస్టా ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాల రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. అమెరికా, భారత్, చైనా, ఫ్రాన్స్, బ్రెజిల్ మాత్రమే బలమైన విత్తన పరిశ్రమలను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో 80% మంది రైతులు స్థానిక విత్తనాలపైనే ఆధారపడుతున్నట్టు తెలిపారు. ఆయా దేశాల్లో ఇస్టా ఆధ్వర్యంలో పటిష్టమైన విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. 2024 నాటికి ఇస్టా ఏర్పాటై వందేండ్లు అవుతున్న సందర్భంగా ఇంగ్ల్లండ్లోని కేంబ్రిడ్జ్లో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు.