Electricity Consumption | రాష్ట్రంలో విద్యుత్ వినియోగం (Electricity Consumption) రోజు రోజుకు మరింత పెరుగుతున్నది. తెలంగాణ (Telangana) చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది ఇదే రోజున గరిష్ఠంగా 12,966 మెగావాట్ల వినియోగం ఉండడం గమనార్హం. రాబోయే రోజుల్లో కరెంటు వినియోగానికి మరింత డిమాండ్ ఉండే అవకాశం ఉందని ట్రాన్స్కో అధికారులు భావిస్తున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాల వల్ల డిమాండ్కు కారణాలు పేర్కొంటున్నారు. అయితే, మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయానికే 37శాతం వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు వ్యవసాయానికే కేవలం 35శాతమే వినియోగించే వారని పేర్కొంటున్నారు. వేసవికాలం సమీపిస్తుండడంతో డిమాండ్ పెరిగి 37శాతానికి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా పంటలకు నీటిని అందించడం పెరిగిందని, అలాగే ఉద్యాన పంటలకు సైతం నీటి వాడకం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బోరుబావులపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువైందని అధికారులు పేర్కొంటున్నారు. రబీ సీజన్లో దాదాపు 16వేల మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. డిమాండ్ ఎంత వచ్చినా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.