ఏ ఊరి చెరువు చూసినా నిండా నీళ్లు.. కొన్ని చోట్ల పొంగి పొర్లుతుంటే, మరికొన్ని చోట్ల మత్తళ్లు దుంకుతున్నాయి. ఒకటా, రెండా.. రాష్ట్రంలోని అన్ని చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి.
Telangana | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): కరవు కాటకాలు తెలంగాణ దరిదాపులకు కూడా వచ్చే అవకాశమే లేదిక. మూడుపంటలకు ఢోకా లేదిక. పుట్లకొద్ది ధాన్యపు రాసులతో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించటం ఖాయం ఇక. నిన్నమొన్నటి వరకు పడ్డ వర్షాలతో తెలంగాణ చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వందకు వందశాతం చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్నాయి. కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాలు తెలంగాణ రైతాంగానికి అందివస్తున్నాయి. రైతన్న ఏ పంట వేసుకోవాలి? ఎంత పండించాలి? అన్నదానిపై ఆంక్షలు లేవు. క్రాప్ హాలిడేలకు కాలం చెల్లినట్టే. రాష్ట్రంలో మొత్తం జలవనరులు 46,500 ఉన్నాయి. వీటిలో జియోట్యాగ్ చేసిన చెరువులు 34,697 ఉన్నాయి.
ఇప్పుడు అన్నింటికి అన్నీ నిండుగా ఉన్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నాయి. నీటితో పొంగిపొర్లుతున్న చెరువుల సంఖ్య 7,145 కాగా, 17,861 చెరువులు వందశాతం నీటితో నిండాయి. అంటే మత్తళ్లు దుంకుతున్నాయి. మరో 3,272 చెరువులు 75 శాతం – 95 శాతం నిండాయి. 3,437 చెరువులు 50 శాతానికిపైగా నీటితో ఉన్నాయి. కొన్నేండ్లుగా రాష్ట్రంలోని చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. అయితే, ఈ ఏడాది ఆగస్టు నెల కూడా గడవకముందే వందకు వంద శాతం చెరువుల్లో పూర్తిస్థాయిలో నీళ్లున్నాయి. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఇప్పుడున్న చెరువుల్లో 20 వేల చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించి, ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీళ్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నిర్ణయం ఫలించి అన్ని చెరువులు నిండిపోయాయి.
విధ్వంసం నుంచి విజయం
ఉమ్మడి రాష్ట్రంలో వట్టిపోయిన చెరువులు నేడు జలకళను సంతరించుకున్నాయి. సమైక్యపాలనలో పాలకులు తెలంగాణాలోని చెరువులను ధ్వంసం చేశారు. చెరువులే ఆధారంగా బతికిన రైతుల జీవితాలు ఆగమయ్యాయి. దిక్కులేక బోరుబావులపైనే ఆధారపడేవారు. అవీ భూగర్భజలాలు ఇంకిపోయి అడుగంటిపోయేవి. దీంతో పంట వేసినా నీళ్లు లేక ఎండిపోయిన సందర్భాలు అనేకం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సర్కారు చెరువుల పునరుద్ధరణను యజ్ఞంగా నిర్వహించింది. దీంతో ఐదేండ్లలోనే తెలంగాణ నుంచి కరవు రక్కసి దూరమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగాయి. రైతన్న మూడుపంటలు వేసుకునే అవకాశం కలుగుతున్నది.
రికార్డు స్థాయి వర్షాలనూ తట్టుకొని..
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రికార్డు వర్షపాతం నమోదైంది. 30 ఏండ్ల చరిత్రను తిరగరాసేలా వర్షాలు పడ్డాయి. సాధారణంగా అయితే ఇటీవల పడ్డ వర్షాలకు చెరువుల కట్టలన్నీ తెగిపోవాలి. కానీ, మిషన్ కాకతీయలో బాగుచేసిన చెరువులు చెక్కుచెదరలేదు. రాష్ట్రం ఏర్పడకముందు (2010లో) 4,251 చెరువులు వర్షాలకు తెగిపోయాయి. 2013లో 1,868 చెరువులు తెగిపోయాయి. మిషన్ కాకతీయ తర్వాత 2022లో 43 చెరువులు మాత్రమే తెగిపోగా, 2023లో 155 చెరువులకు స్వల్ప నష్టం వాటిల్లింది. ఇవన్నీ చిన్న మరమ్మతులతో మళ్లీ నీటిని నిల్వ చేసుకొనే స్థితికి వచ్చేశాయి.