శాయంపేట, ఏప్రిల్ 16 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు జలుగూరి రవీందర్ (44) సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గ్రామంలో మొదట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతోపాటు కేసీఆర్ పిలుపుతో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన మరణాన్ని తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
రవీందర్ మృతితో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కలత చెందారు. మంగళవారం హుటాహుటిన కొప్పుల గ్రామానికి వెళ్లి రవీందర్ భౌతికకాయంపై పూలమాల ఉంచి, బీఆర్ఎస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ తాను కన్నీరు పెట్టుకున్నారు. అంతిమయాత్రలో రవీందర్ శవపేటికను మోశారు.
23 ఏండ్లుగా ఉద్యమ పార్టీని వీడకుండా నిఖార్సైన ఉద్యమకారుడిగా రవీందర్ నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. రవీందర్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, గ్రామస్థులు, నాయకులు, కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు.