హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నదని చెప్పారు. నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తూ బలీయమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందిందని వెల్లడించారు. సోమవారం భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చరిత్రాత్మక గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం చేసిన ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
మెరిసి మురిసిన తెలంగాణ
వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా ఉత్తేజంతో జరుపుకొంటున్న తెలంగాణ ప్రజలకు, యావత్ భారత జాతికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి భారతదేశ స్వేచ్ఛకు, సార్వభౌమాధికారానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రతి ఇంటిపై జాతీయ జండా ఎగురేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. 1.20 కోట్ల జండాలను తెలంగాణ కార్మికులచేతనే తయారుచేయించి ఇంటింటికీ అందించింది. ప్రభుత్వ పిలుపునకు ప్రతిస్పందించిన తెలంగాణ ప్రజానీకం ప్రతి ఇంటిపై మువ్వన్నెల జండాలను ఎగురవేయటంతో యావత్ తెలంగాణ త్రివర్ణ శోభితమై మెరిసి మురిసిపోతున్నది.
మహనీయుల త్యాగాలను స్మరించుకొంటూ.. ఆనాటి పోరాట చరిత్రను, విలువలను నేటి తరానికి అందించాలన్న సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఈ నెల 8నుంచి 22 వరకు ఘనంగా నిర్వహిస్తున్నది. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి మొదలుకొని వేలమంది యోధులు తమ ప్రాణాలర్పించి స్వాతంత్య్ర జ్యోతిని వెలిగించారు. స్వాతంత్య్రం నా జన్మహక్కు అన్న లోకమాన్య బాలగంగాధర్ తిలక్, శాంతి, అహింసలతో పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ను నడిపిన సమరసేనాని సుభాష్ చంద్రబోస్.. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం. స్వతంత్ర పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నత పాత్ర పోషించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయాలు.
సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణ
బంకించంద్రుడు వందేమాతర గీతంలో పేరొన్న సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలాం.. అన్న భావనను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసి చూపించింది. సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలతో బీడుపడిన స్థితి నుంచి బయటపడటమే కాకుండా మన రాష్ట్రం ‘సుజల సఫల సస్యశ్యామల తెలంగాణగా ఆవిర్భవించింది. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, ఎరువుల, విత్తనాల పంపిణీ.. రైతుబంధు సమితులు, వేదికలు, కల్లాల నిర్మాణం.. ఒకటా రెండా అనేక అద్భుతమైన పథకాలను సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో 2014లో మొత్తం సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల విస్తీర్ణం కాగా..2020-21 నాటికి 2.15 కోట్ల ఎకరాలకు విస్తరించింది.
ఐక్యరాజ్యసమితి కూడా రైతుబంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడింది. రైతు బీమా ద్వారా ఇప్పటివరకు 84,945 రైతు కుటుంబాలకు 4,247 కోట్లను ప్రభుత్వం అందించి, మానవీయమైన పరిపాలనకు నిజమైన నిదర్శనంగా నిలిచింది. తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ, కాళేశ్వరం నిర్మాణంతో కోటి ఎకరాలకు పైగా సాగునీటి సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత భారీ ఆయకట్టును సృష్టించడం మునుపెన్నడూ జరగని అదృష్టం. పంజాబ్ తరువాత అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. మన జీఎస్డీపీలో 18.6% వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నదని సగర్వంగా ప్రకటిస్తున్నాను.
గ్రామీణ జీవన ప్రమాణాల్లో నంబర్ 1
దేశ నిర్మాణంలో నేడు అద్భుతమైన పాత్ర నిర్వహిస్తూ బలీయమైన ఆర్థికశక్తిగా మన తెలంగాణ రూపొందింది. విద్యుత్తు రంగంలో మార్పులు తెచ్చి.. ఇవాళ అన్ని రంగాలకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును ఇస్తున్నాం. వ్యవసాయంలో 11.6 శాతం రికార్డుస్థాయి వృద్ధిరేటుతో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా అవతరించింది. ఇంటింటికీ నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని వందశాతం గ్రామాలకు సరఫరాచేస్తున్న రాష్ట్రం మనదే. గొర్రెల పెంపకంలో మన రాష్ట్రం నంబర్ 1 గా నిలిచింది. 12.01 శాతం ఉత్పత్తి రంగ వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్నది. గ్రామీణ జీవన ప్రమాణాల్లో నంబర్ 1గా నిలిచింది. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే అత్యధికంగా 26.14 వృద్ధిరేటు సాధించింది.
తెలంగాణకు హరితహారం పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటుచూసినా ఆకుపచ్చదనంతో అలరారుతున్నది. ఎనిమిదేండ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ దేశంలో బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాష్ట్రం అవతరించినప్పుడు రూ.62 వేల కోట్ల రూపాయలున్న రాష్ర్టాదాయాన్ని రూ.1.84 లక్షలకు.. అంటే మూడు రెట్లు పెంచుకొన్నాం. సొంతపన్నుల ఆదాయంలో 11.5% వృద్ధితో దేశంలో ప్రథమస్థానంలో నిలిచామని కాగ్ నివేదిక ఇవ్వడం మన రాష్ర్టానికి గర్వకారణం. జీఎస్డీపీ 127 శాతం పెరిగింది. దేశ జీడీపీ వృద్ధిరేటుకంటే 27% అధికంగా ఉన్నది. తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనం. 2013-14 లో సుమారు రూ.లక్ష మాత్రమే ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల 2021-22 నాటికి రూ.2.75 లక్షలకు పెరిగింది. జాతీయ తలసరి కంటే.. 84 శాతం అధికం. ఇది శుభపరిణామం.
డయాలిసిస్ రోగులకు ఆసరా
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మరో మానవీయమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకొన్నది. డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్న కిడ్నీ పేషెంట్లకు సైతం ఇక నుంచి ఆసరా పింఛన్ అందజేయబడుతుంది. ప్రజలకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాల్లో ప్రభుత్వం డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటుచేసింది. కిడ్నీ రోగులకోసం డయాలసిస్ సెంటర్లను నెలకొల్పింది. రాష్ట్రంలో అన్ని దవాఖానల బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చింది. హైదరాబాద్ నలుచెరగులా 4 టిమ్స్ దవాఖానలను నిర్మిస్తున్నది. నిమ్స్లో అదనంగా 2 వేల పడకలు ఏర్పాటవుతున్నాయి. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు వేగంగా జరుగుతున్నాయి. రాబోయే రెండేండ్లలో ప్రతి జిల్లాకు వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించి అమలుచేస్తున్నది. బస్తీ దవాఖానల స్ఫూర్తితో పల్లె దవాఖానలు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 30% నుంచి 52%కి పెరిగింది.
ప్రసూతి మరణాల సంఖ్య 92 నుంచి 56కు తగ్గింది. శిశు మరణాల సంఖ్య 39 నుంచి 21 కి తగ్గింది. కేసీఆర్ కిట్లు, ఆరోగ్యలక్ష్మి పథకాలతో ఆరోగ్య సూచీల్లో మన రాష్ట్రం అద్భుత పురోగతి సాధించింది. బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల విద్యకు అమితమైన ప్రాధాన్యమిచ్చింది. దేశంలో అత్యధికంగా గురుకులాలు కలిగిన ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ. అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు మన ఊరు – మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా మహిళ, అటవీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పబోతున్నది. అంగన్వాడీల లోని 5,111 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మనం గొప్ప పురోగతిని సాధించాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకొన్నాం. ప్రస్తుతం వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసుకొంటున్నాం. ఉద్యోగాలు 95% తెలంగాణ అభ్యర్థులకే దక్కేవిధంగా లోకల్ క్యాడర్ వ్యవస్థను రూపొందించుకొన్నాం.
సాంకేతిక విప్లవానికి నాంది సీసీసీ
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత పటిష్ఠంగా అమలు కావడం కోసం ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించుకొన్నాం. ఈ సెంటర్ ఏర్పాటుతో సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి ఇనుమడించింది. పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతిక విప్లవానికి ఈ సెంటర్ నాంది పలికింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగింది. పరిశ్రమల అనుమతులకోసం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ విప్లవాత్మక ఫలితాలు సాధించింది. తెలంగాణ పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. పారిశ్రామికరంగంలో ఈ ఎనిమిదేండ్లలో రూ.2,32,111 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. 16.50 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందు కు దూసుకుపోతున్నది. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐటీ పరిశ్రమలు నేడు హైదరాబాద్లో కొలువై ఉన్నాయి. ఐటీ ఉద్యోగాల సృష్టిలో మన రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో తెలంగాణ ఐటీ పరిశ్రమ 1.55 లక్షల ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించింది. ఐటీ రంగంలో మొత్తంగా 7.80 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. నిరుడు ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 శాతం ఉండగా, తెలంగాణ వృద్ధిరేటు 26.14 శాతం. ఇది తెలంగాణ ఐటీ రంగంలో సాధించిన గొప్ప ప్రగతికి నిదర్శనం. ఇటీవలే ప్రభుత్వం హైదరాబాద్లో ప్రారంభించిన టీ-హబ్ 2.0 ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆవిషరణల కేంద్రంగా నిలిచింది. మన తర్వాత ఫ్రాన్స్ దేశం రెండో స్థానంలో ఉన్నది. దేశంలో అతి ఎకువ ఆఫీస్ స్పేస్ను కల్పిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది.
సామాజిక ఉద్యమంగా దళిత బంధు
అణగారిన దళితజాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక దళితబంధు పథకాన్ని తెచ్చింది. దళితుల జీవితాల్లో చీకట్లను చీల్చే కాంతిరేఖగా దళితబంధు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది. ఇది ఒక సంక్షేమ పథకంగా కాక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకొంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాం. కల్యాణలక్ష్మి – షాదీముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 11,24,684 మంది ఆడపిల్లల పెండ్లిళ్లకు రూ.లక్షా నూట పదహార్లు చొప్పున సహాయాన్ని అందించిన ఘనత తెలంగాణదే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. గొర్రెల పెంపకంతో రాష్ట్రంలో గొల్ల కుర్మలు కలిగి ఉన్న గొర్రెల సంఖ్య 1.91 కోట్లు. దీంతో మాంసోత్పత్తి పెరిగి పింక్ రెవల్యూషన్ వచ్చింది.
మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు జలాశయాల్లో చేప పిల్లలు వదలటంతో 25,782 కోట్ల మత్స్య సంపద సృష్టితో బ్లూ రెవల్యూషన్ వచ్చింది. గౌడసోదరుల సంక్షేమం కోసం చెట్ల పన్నును బకాయిలతో సహా రద్దుచేశాం. మద్యం దుకాణాల కేటాయింపుల్లో 15% రిజర్వేషన్లు, దోభీ ఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. వజ్రోత్సవ సందర్భంలో నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సొమ్మును ప్రభుత్వం అందజేస్తుంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా వందశాతం ఆవాసాలకు మంచినీరు అందించడంతో తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కొనియాడింది. అతి తక్కువ వ్యవధిలో ఇంత బృహత్తర పథకాన్ని పూర్తిచేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.
10 లక్షల మందికి అదనంగా ఆసరా
రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకొంటూ, కడుపులో పెట్టి చూసుకొంటూ.. సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఖ్యాతి పొందింది. దీనికి కొనసాగింపుగా నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తున్నాను. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పింఛన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్ధిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిషరించిందని సవినయంగా తెలియజేస్తున్నాను.
తెలంగాణ యోధులను స్మరించుకున్న కేసీఆర్
జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నాం. స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకొంటున్నాం. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి, నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. భారత స్వాతంత్య్రం కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్ర నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అల్లావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నరసింహారావు మొదలైనవారి సాహసోపేత పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్య్రోద్యమ సమయంలో హైదరాబాద్ను సందర్శించిన గాంధీజీ ఇక్కడి ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం. అందుకే తెలంగాణలో నెలకొన్న సర్వమత సామరస్య భావనను ప్రతిబింబిస్తూ బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్టమస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ పండుగల సందర్భంగా పేదలకు కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నది.