యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సన్నద్ధం
సీఎం కేసీఆర్ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం
ఈ సీజన్లో పెరిగిన సాగు విస్తీర్ణం
గతంలో మాదిరిగా గ్రామాల్లోనే కాంటాలు
ఉత్కంఠ తొలిగి నిబ్బరంగా కర్షకులు
ఉమ్మడి జిల్లాలో 6,93,310 ఎకరాల్లో వరి పంట
రంగంలోకి అధికారయంత్రాంగం
991 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమాయత్తం
12.04 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం
‘పంటయితె పుష్కలంగ పండింది.. అమ్ముకునుడు ఎట్లనో’నని అన్నదాతలు రందిపడకుండా రాష్ట్ర సర్కారు గుండె నిబ్బరం కల్పించింది. కరోనా కష్టకాలంలో రైతులెవరూ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఎప్పటిలానే ఊరూరా కాంటాలు పెట్టి వడ్లు కొనేందుకు రంగంలోకి దిగింది. ‘ఆందోళన చెందాల్సిన పనిలేదు.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తా’మని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం రైతుల్లో భరోసా నింపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో 6,93,310ఎకరాల్లో వరి సాగవగా, 12.04లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అధికారయంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు 1688 పంచాయతీల పరిధిలో 991 సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
వరంగల్ రూరల్/మహబూబాబాద్/జయశంకర్ భూపాలపల్లి/ములుగు/జనగామ, మార్చి 30 (నమస్తేతెలంగాణ)/హన్మకొండ : యాసంగి ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ‘రైతులు ఆందోళన పడొద్దు.. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తాం’ అని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే కర్షకుల్లో భరోసా నెలకొంది. కరోనా నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే గతంలో మాదిరి గ్రామాల్లోనే కాంటాలు పెట్టి ధాన్యం కొంటామని సీఎం ప్రకటించారు. కాగా ఈసారి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ, దేవాదుల కాలువల ద్వారా నీరు రావడం, అంతకుముందే భారీ వర్షాల కారణం గా చెరువులు, కుంటలు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉండడం తో ఉమ్మడి జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగానే దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ మేరకు ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అధికార యంత్రాం గం రంగంలోకి దిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 6,65,050ఎకరాల్లో వరి సాగవగా, 12.04లక్షల మెట్రి క్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నది.
మహబూబాబాద్లో..
మహబూబాబాద్ జిల్లాలోని 461 పంచాయతీల పరిధిలో 1,76,543 ఎకరాల్లో వరి సాగవగా, ధాన్యం సేకరణకు 160 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సీజన్లో 4,23,703 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 10 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కేంద్రాల్లో గన్నీ సంచులు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లిలో
జిల్లాలోని 11 మండలాల్లో 241 పంచాయతీల పరిధిలో 1.25లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సవిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ రాఘవేందర్ తెలిపారు. ఈ యాసంగిలో 79వేల ఎకరాల్లో వరి సాగవగా 190 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో 140 పీఏసీఎస్, 14 ఐకేపీ, 7 జీసీసీ, 29 డీసీఎంఎస్ కేంద్రాలున్నాయి. మొత్తం 31లక్షల గన్నీ సంచులు అవసరం కాగా ప్రస్తుతం 22లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయని, మరో 9లక్షల సంచులు అవసరమున్నట్లు అధికారులు తెలిపారు. వర్షకాలంలో ధాన్యం కొనుగోళ్లకు వర్తింపజేసిన అన్ని నిబంధనలు ఇప్పుడు కూడా వర్తిస్తాయని తెలిపారు. తేమ శాతం 17కు మించరాదని, తాలు, రాళ్లు, చెత్త ఉండకూడదని, ప్రతి కేంద్రంలో తేమను కొలిచే పరికరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన సమయంలో టోకెన్ విధానాన్ని పాటించాల్సి ఉంటుందని రాఘవేందర్ సూచించారు.
ములుగులో..
ములుగు జిల్లాలోని 174 పంచాయతీలకు 170కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సర్కారుకు మంగళవారం ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి అరవిందరెడ్డి తెలిపారు. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 55వేల ఎకరాల్లో రైతులు వరి పండించారు. రామప్ప, లక్నవరం సరస్సులతో పాటు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వచ్చే సాగునీటితో గతేడాదికంటే అధిక విస్తీర్ణంలో వరి వేశారు. జిల్లాలో 13లక్షల 75వేల క్వింటాళ్ల (1.37 లక్షల మెట్రిక్ టన్నులు) ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అవసరమైన గన్నీ బ్యాగులను సైతం సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మరో 15 రోజుల్లో వరి కోతలు మొదలయ్యే అవకాశమున్నందున ఆయా ప్రాంతాల్లో ముందుగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
జనగామలో..
జిల్లాలోని 281 పంచాయతీల పరిధిలో ఈ యాసంగి సీజన్లో రైతులు జనగామ లక్షా 59వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. లక్షా 6వేల413 టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 187 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.
వరంగల్ రూరల్లో..
రూరల్ జిల్లాలో ఈ యాసంగిలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం గ్రామా ల్లో 179 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జిల్లాలో 401 పంచాయతీల పరిధిలో రైతులు ఈ యాసంగిలో సుమారు లక్షా 20వేల ఎకారల్లో వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై పౌరసరఫరాల శాఖ అధికారులు కలెక్టర్ హరితతో మంగళవారం చర్చించారు. కొనుగోళ్లపై కలెక్టర్ గురువారం అధికారులతో సమావేశం కానున్నారు. కేంద్రాలు, కేటాయింపులు, ప్రారంభంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. సుమారు 50లక్షల గన్నీ సంచులు అవసరమని, ఇప్పటికే 30 లక్షల మేరకు అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
వరంగల్ అర్బన్లో..
వరంగల్ అర్బన్ జిల్లాలో 130 పంచాయతీల పరిధిలో1,03,767 ఎకరాల్లో వరి సాగైంది. ఈ మేరకు 2,13,165 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు 105 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించింది. సెంటర్లను రైస్ మిల్లులకు టాగ్ చేయాల్సి ఉందని సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు. గ్రేడ్ ఏ ధాన్యం క్వింటాలుకు మద్దతు ధర రూ.1885, కామన్ ధాన్యం క్వింటాలుకు రూ.1835గా నిర్ణయించింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాదికంటే ఈ సారి సాగు విస్తీర్ణం సుమారు 40శాతం పెరిగిందని వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు వెల్ల్లడించారు. సన్న రకాలు, దొడ్డు రకాలు, సీడ్స్ కంపెనీల ఆధ్వర్యంలోవి కలిపి జిల్లాలో మొత్తం 41,507 హెక్టార్లలో వరి సాగైందని పేర్కొన్నారు. 50వేల మెట్రిక్ టన్నుల సీడ్స్ ధాన్యం తప్పించి సన్నధాన్యం 16,082 ఎంటీలు, దొడ్డు ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసే అవకాశం ఉండగా, మిగిలిన 2,13,165 ఎంటీల ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చేయనుంది. మొత్తం 105 సెంటర్లలో ఐకేపీ 35, పీఏసీఎస్ 68, డీసీఎంఎస్ 1, ఏఎంసీఎస్ 1 ఉన్నాయి. అయితే ఇవి ప్రతిపాదించినవి మాత్రమే కాగా, కలెక్టర్ ఆధ్వర్యంలో ఫైనలయ్యే అవకాశముంది. మొత్తం 53,29,125 గన్నీ సంచులు అవసరం ఉండగా 14,11,443 సంచులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 39,17,682 సంచులు కావాల్సి ఉండగా, వీటిలో కొత్తవి 19,29,687, పాతవి 18,33,889 సంచుల అవసరం ఉంది.
ఏర్పాట్లు చేస్తున్నం
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నం. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అందులో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఏప్రిల్ మొదటి వారం నుంచి వరి కోతకు వచ్చే అవకాశముంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం. గతంలో నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం కొంటాం. ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవాలి.
కృష్ణవేణి, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డీఎం, వరంగల్ అర్బన్ జిల్లా
ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు
మహబూబాబాద్ జిల్లాలో ఏప్రిల్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించాం. మొదటి వారంలో వరి కోతలు మొదలవుతాయి. ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకువచ్చే సరికి కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేస్తాం. వానకాలం సీజన్లో ఉన్న మద్దతు ధరతోనే కొంటాం. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు సిద్ధం చేసుకోవాలని సంఘాలను ఆదేశించాం.
మహేందర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, మహబూబాబాద్