హైదరాబాద్ : అంతర్జాతీయ క్రీడల్లో అద్భుత విజయాలను సాధిస్తూ భారతదేశం కీర్తితో పాటు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్కు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో 600 గజాల స్థలాన్ని రాష్ట్ర క్రీడాశాఖ తరఫున కేటాయించగా.. నిఖత్ జరీన్ తండ్రికి మంత్రి శ్రీనివాస్గౌడ్ సోమవారం స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. త్వరలోనే నిఖత్కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదిలా ఉండగా.. గతేడాది టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలను సాధించిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.2కోట్ల నగదు బహుమతితో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది రూ.2కోట్ల నగదు చెక్కును సీఎం కేసీఆర్ అందజేయగా.. తాజాగా ప్రభుత్వం ఇంటి స్థలాన్ని అందజేసింది.