నీలగిరి, మార్చి 9: టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవి కావని, అగ్రకుల అహంకారంతోనే చేశారని మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్గౌడ్ విమర్శించారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నవ్య హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెరుకు సుధాకర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
చెరుకు సుధాకర్ను పార్టీలకతీతంగా ఉద్యమకారుడిగా, బహుజన వర్గాల నాయకుడిగా సమాజం చూస్తున్నదన్నారు. కోమటిరెడ్డిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రదీప్గౌడ్ డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని చెప్పారు. అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తమ కుటుంబం 40 ఏండ్లుగా అనేక ఉద్యమాలు చేసి కష్టాలను చూసిందని తెలిపారు.
ఒక ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనైతికంగా మాట్లాడి న్యాయస్థానంపై గౌరవం ఉన్నదని చెప్తే సమాజం సిగ్గు పడుతుందని విమర్శించారు. ‘నీ క్షమాపణ అవసరం లేదు. నీ ప్రవర్తన మార్చుకో చాలు. నీకు కోర్టుల మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే గిట్లనేనా మాట్లాడేది’ అని మండిపడ్డారు. వెంకట్రెడ్డిది బహుజనులను అణగదొకిన చరిత్ర అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్ అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి, ద్వితీయ శ్రేణి నాయకుల తయారీపై గడియారం సెంటర్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.