హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్’ పోర్టల్ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నది. సాప్ట్వేర్లో సాంకేతిక లోపాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో వాహన్ పోర్టల్ ద్వారా చేపట్టాల్సిన పనులపై ఆర్టీఏ సిబ్బందికి, వెహికల్స్ డీలర్లకు సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోతున్నది. ఢిల్లీకి చెందిన సాంకేతిక నిపుణులతో సమస్యలను పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నా రోజూ అయ్యే రిజిస్ట్రేషన్లకు, జారీ చేయాల్సిన పర్మినెంట్ రిజిస్ట్రేషన్లకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతున్నది. తెలంగాణ ఆర్టీఏ సేవలు ‘వాహన్’ పోర్టల్లోకి మారడంతోనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.
వాహన్ పోర్టల్లో నెలకొన్న సాంకేతిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు ఆర్టీఏ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ భారీగానే పెరుగుతున్నదని, అందుకు తగినట్లుగా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా వాహన్ ద్వారా మొత్తం 75,099 తాతాలిక రిజిస్ట్రేషన్లు అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 41 వేల వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లు, 2,441 ఫ్యాన్సీ నంబర్లను పారదర్శకంగా కేటాయించినట్లు వెల్లడించారు. వెరిఫికేషన్, ఇన్స్పెక్షన్ స్థాయిలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను ఒకో లాగిన్లో 25 లోపు తగ్గించినట్లు వివరించారు. ఇంకో వారం రోజుల్లో వాహన్ వ్యవస్థ పూర్తిగా స్థిరపడుతుందని ఇలంబర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.