హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : కేంద్రియ విద్యాలయాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అత్యంత నాణ్యమైన విద్యకు కేరాఫ్గా ఉన్న ఈ విద్యాలయాలకు టీచర్ల కొరత ఏర్పడింది. దీంతో బోధించే వారు లేకపోవడంతో పిల్లలకు రెండు, మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వాల్సి వస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్లోని కేవీల్లో కొన్ని తరగతులకు వారంలో ఒకరోజు.. మరికొన్ని తరగతులకు వారానికి రెండు రోజుల చొప్పున సెలవులు ఇచ్చేస్తున్నారు. టీచర్ల కొరతతో క్లాసులు నిర్వహించలేని పరిస్థితిలో కేవీ స్కూళ్లున్నాయి. కాంట్రాక్టు టీచర్లను నియమించినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఫలితంగా ఏరి కోరి ఎంపిక చేసుకున్న స్కూళ్లలో అడ్మిషన్లను తల్లిదండ్రులు రద్దు చేసుకొని, తమ పిల్లలను వేరే స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మరికొంత మంది వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో 605 పోస్టులు ఖాళీ
రాష్ట్రంలో 35 కేవీలు ఉండగా, వీటిల్లో జనవరి 2022 వరకు 602 టీచర్, 53 బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 602 టీచర్ పోస్టుల్లో కేవలం 454 కాంట్రాక్ట్ టీచర్లను మాత్రమే నియమించారు. వీరిని మినహాయించగా, 148 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ టీచర్లు సైతం పలు కారణాలతో ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఇటీవలే కేవీ సంఘటన్ 13 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కాంట్రాక్టు టీచర్లలో అత్యధికులు ఈ ఉద్యోగాలకు పోటీపడుతుండటంతో ప్రిపరేషన్ కోసం వీరంతా కాంట్రాక్టు ఉద్యోగాలను వదులుకున్నారు. దీంతో టీచర్ల కొరత సమస్య మరింత తీవ్రమైనట్టు హైదరాబాద్లోని ఓ కేవీ స్కూల్ హెడ్ తెలిపారు. టీచర్ల కొరత సమస్యతో విద్యార్థులకు సెలవులిస్తున్న మాట వాస్తవమేనని, సోమవారం కల్లా కొత్త కాంట్రాక్టు టీచర్లను నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు మరో కేవీ స్కూల్ హెడ్ వెల్లడించారు. టీచర్ల కొరత సమస్య తమ దగ్గర మాత్రమే లేదని, దక్షిణ భారతంలోని అన్ని కేవీల్లో ఉన్నదని ఓ టీచర్ అన్నారు.
పరిస్థితి ఇలా..
2 గ్రేటర్ హైదరాబాద్లోని ఓ కేంద్రియ విద్యాలయం ప్రైమరీ స్కూల్లో ఇది వరకు 30 మంది టీచర్లుంటే, ప్రస్తుతం 20 మందే ఉన్నారు. దీంతో ఈ స్కూల్లోని విద్యార్థులకు వారానికి ఒకటి, రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నారు.
2జీహెచ్ఎంసీ పరిధిలోని మరో కేవీలో 6వ తరగతి చదువుతున్న తమ కొడుకు అడ్మిషన్ రద్దు చేసి, మరో స్కూల్లో చేర్పించింది ఓ తల్లి. జీహెచ్ఎంసీలో పని చేసే మహిళా ఉద్యోగి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సీటు దక్కించుకోగా, ఇప్పుడు ఉసూరుమంటూ అడ్మిషన్ రద్దు చేసుకుంది. ఇది వరకు చదువుల్లో చురుగ్గా ఉన్న తమ కుమారుడు, రోజురోజుకూ వెనుకబడటంతో ప్రైవేటు స్కూల్లో చేర్పించింది.
2సికింద్రాబాద్ కేవీలో చదువుతున్న తమ కుమారుడు హోంవర్క్ చేయకపోవడం, ట్యూషన్కు వెళ్లేందుకు మొరాయించడంతో ఆరా తీస్తే టీచర్లు రావడం లేదని, క్లాసులు చెప్పడం లేదని తేలగా, తమ కుమారుడిని మరో స్కూల్లో చేర్పించేందుకు ఓ తండ్రి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు.
ఆర్టీఈ కోటాకు తూట్లు
కేవీల్లో విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) యాక్ట్ ప్రకారం 25 శాతం సీట్లను పేద, బలహీన వర్గాల వారికి కేటాయించారు. వీరికి పూర్తి ఉచిత విద్యను అందించడంలో భాగంగా ఏటా రూ.11 వేలను కేంద్రం చెల్లించాల్సి ఉంది. కానీ, ఈ కోటాకు కేంద్రం తూట్లు పొడిచింది. కొంత కాలం పాటు విద్యార్థుల అకౌంట్లలో నగదు జమ చేసిన కేంద్రం, 2015 తర్వాత ఈ పథకాన్ని ఉపసంహరించుకున్నది. ఆయా మొత్తాన్ని విద్యార్థుల అకౌంట్లలో జమ చేయడం లేదు. దీంతో ఈ కోటాలో ప్రవేశాలు పొందిన వారికి మిగతా విద్యార్థులతో పాటు ఫీజులు చెల్లించడం సహా పుస్తకాలు, స్టేషనరీ కొనుగోలు భారం తప్పడం లేదు.