Telangana | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పలు దేశ, విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఎంవోయూలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్బాబు, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఇతర అధికారులు సంతకాలు చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలలో బ్రిటన్కు చెందిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (ఎస్ఐజీహెచ్), టాటా గ్రూప్, బీఎల్ ఆగ్రో, క్యూ సెంట్రియో, ఉబర్, సిస్ట్రా, ఓ9 తదితర కంపెనీలు ఉన్నాయి. బీఎల్ గ్రూప్ రూ.500 కోట్లు, ఎస్ఐజీహెచ్ రూ.235.1 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించాయి. అత్యధికంగా టాటా గ్రూప్ సంస్థ రూ.1500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఆయా సంస్థల అధిపతులు, ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూపు ముందుకొచ్చింది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. ఈ 50 ఐటీఐల్లో అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటునకు, వాటిల్లో కొత్త కోర్సులపై శిక్షణనిచ్చేందుకు మాస్టర్ ట్రైనర్లను నియమించనున్నది.
వివిధ ఆహార ఉత్పత్తులను తయారుచేసే ఉత్తరప్రదేశ్కు చెందిన బీఎల్ ఆగ్రో సంస్థ తెలంగాణలో ప్రాథమికంగా రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తమ సంస్థలో 5000 మంది ఉపాధి లభిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ రాష్ట్రంలో రూ. 231.5 కోట్లమేర పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఐటీ అభివృద్ధి సేవలు అందించే క్యూ సెంట్రియో కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ పరిధిలో దాదాపు 1000 ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఉబర్ కంపెనీ హైదరాబాద్లో తమ సేవలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో సుమారు 1000 మంది ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. రాష్ట్రంలో డిజిటల్ సెంటర్ ఏర్పాటునకు సిస్ట్రా కంపెనీ ముందుకొచ్చింది.
ఓ9 సొల్యూషన్స్ సంస్థ తెలంగాణలో ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రత్యేక సైప్లె చైన్ నైపుణ్యాల అకాడమీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. సైప్లె చైన్ నైపుణ్యాలను అందించేందుకు ఈ అకాడమీ తోడ్పడనున్నది. డబ్ల్యూఈఎఫ్ సదస్సు గురువారం ముగియడంతో సీఎం రేవంత్రెడ్డి అక్కడినుంచి నేరుగా లండన్ చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.