హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ విత్తనాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తున్నది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది. ఇటీవల ఆయిల్పామ్ విత్తనాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సంకాన్ని 5 నుంచి 30 శాతానికి పెంచిన నేపథ్యంలో దానిని తగ్గించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి కేంద్రానికి లేఖలు రాశారు. ఇది రైతులకు పెనుభారంగా మారుతుందని, ఆయిల్పామ్ సాగుపై దుష్ప్రభావం చూపిస్తుందని వివరించారు. తెలంగాణ రాసిన లేఖలను పరిగణనలోనికి తీసుకొని, ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు కేంద్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వివేక్జోహ్రి వెల్లడించారు. ఆయిల్పామ్ విత్తనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెన్నై కస్టమ్స్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్కు లేఖ రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. పాత విధానం ప్రకారం సుంకాన్ని తగ్గించేందుకు వర్గీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో చెన్నై కస్టమ్స్ అధికారులు ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నదని రాష్ట్ర ఆయిల్ఫెడ్ అధికారులు భావిస్తున్నారు.
మరో ఐదు జిల్లాలకు కేంద్రం ఆమోదం
ఇప్పటికే తెలంగాణలోని 25 జిల్లాల్లో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు అమోదం తెలిపిన కేంద్రం తాజాగా మరో ఐదు జిల్లాలను చేర్చింది. వీటిలో వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి. అయితే సాగు విస్తీర్ణంపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ ఐదు జిల్లాల్లో సుమారు లక్ష నుంచి లక్షన్నర ఎకరాల్లో సాగుకు అనుమతి లభించే అవకాశమున్నదని అధికారుల అంచనా. దీంతో కేంద్రం అనుమతించిన విస్తీర్ణం దాదాపు 9.5 లక్షలకు చేరనున్నది. వచ్చే మూడేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. కొత్తగా అనుమతి పొందిన జిల్లాల్లో యాదాద్రి భువనగిరిని తమకు కేటాయించాలని కోరినట్టు తెలంగాణ ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కల సేకరణపై దృష్టి పెట్టినట్టు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు.