హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఎంతో ప్రత్యేకత కలిగిన తాండూరు కంది పప్పుకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని తాండూరు ప్రాంతంలో ఇది అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ పప్పులో ప్రొటీన్ శాతం 22-24 వరకు ఉంటుంది. మిగతా పప్పులతో పోల్చితే ఇది మూడింతలు ఎక్కువ. ఇతర రకాల పప్పుతో పోల్చితే రుచి ఎక్కువ. మంచిగా ఉడుకుతుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రకం పప్పు సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. తాండూరు పప్పుపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు నిర్వహించారు. తాండూరు పప్పుకు జీఐ గుర్తింపు రావడంపై వర్సిటీ పరిశోధన విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ జగదీశ్వర్ హర్షం ప్రకటించారు.
జీఐ గుర్తింపుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తాండూరు కంది పప్పు మరింత ప్రాచుర్యం పొందనున్నది. అంతర్జాతీయ ఎగుమతులకు లైన్ క్లియర్ కావడంతో ఎగుమతులు భారీగా పెరుగుతాయి. జాతీయ స్థాయి మార్కెట్లోనూ ఈ పప్పుకు భారీ డిమాండ్ పలికే అవకాశం ఉన్నది.