మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 7: వచ్చే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే అన్ని రకాల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కోట్లాది టన్నుల ధాన్యం నిల్వలు గోదాముల్లో పేరుకుపోయాయని, వచ్చే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం పేర్కొనడం దారుణమన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిందని, దీంతో దేశంలో వరి, గోధుమ పంటలు వేయొద్దని చెప్తున్నదని విమర్శించారు. అమెరికాలో వరి, గోధుమలు ఎక్కువగా పండుతాయని, అక్కడి పంటకు డిమాండ్ ఉండాలంటే మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను తగ్గించాలనే దురుద్దేశంతో రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే దేశంలో అన్ని రకాల పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిన ప్రధాని మోదీ.. రైతులను నాశనం చేసే చట్టాలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, విద్యుత్తు సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు జూలకంటి రంగారెడ్డి, వీరవెళ్లి వెంకటేశ్వర్లు, బంటు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.