హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తున్నది. వివిధ రాష్ర్టాల నుంచి స్వచ్ఛందంగా వివిధ సంఘాల ప్రతినిధులు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా సోమవారం తమిళనాడులోని నాడార్ సంఘాలు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాయి. దీనికోసం త్వరలో చెన్నైలో జరిగే నాడార్ కుల సంఘాల సమావేశానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించనున్నట్టు తెలిపాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ను కలవటానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజంశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను నాడార్ సంఘాల నాయకులు కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో కుల వృత్తులకు వైభవం వచ్చిందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమిళనాడులోనూ అమలు చేయాలని కోరారు. తెలంగాణలో గౌడ, ఈడిగ కులస్థులకు అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. తమిళనాడులో నాడార్లను ఓటుబ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు నాడార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ అరసు, ఆలిండియా తమిళనాడు నాడార్ సంఘం ప్రధాన కార్యదర్శి ముత్తు రమేశ్, ఆలిండియా తమిళనాడు నాడార్ సంఘం ఆర్గనైజర్, తమిళనాడు నాడార్ సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణన్, తమిళనాడు నాడార్ సంఘం కోశాధికారి జ్ఞాన గౌతమ పాండియన్, తమిళనాడు నాడార్ సంఘాల కో-ఆర్డినేటర్ శశికాంత్, నాడార్ సంఘం సమన్వయ కర్త కడకరై కార్తీకన్, వీరాకుమార్, నాడార్ సంఘం అధ్యక్షుడు, ఎన్డీఆర్ ఫౌండేషన్ మహారాష్ట్ర అధ్యక్షుడు పువణేశ్ నాడార్, తైవ కుమార్ నాడార్ తమిళనాడు సంఘం మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.