హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ, పెండింగ్ డీఏల విడుదల సహా పలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి దిగిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో ఎలాంటి పరిష్కారం లేకుండానే చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఎంప్లాయీస్ జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదివారం బేగంపేటలోని ప్రజాభవన్లో చర్చలు జరిపారు.
జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శులు బీ శ్యామ్, హుస్సేనీ, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, రమేశ్, రవి పాల్గొన్నారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల విడుదల అంశాలను నేతలు ప్రస్తావించారు. పీఆర్సీ, పెండింగ్ డీఏల విడుదలపై సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. నాన్చివేత ధోరణి అవలంబించింది. ప్రభుత్వం పీఆర్సీ నివేదిక తెప్పించుకోవాలని, మూడు డీఏలు విడుదల చేయాలని జేఏసీ నేతలు కోరారు. డీఏల విడుదలపై సోమవారంలోగా నివేదిక సమర్పించాలని సీఎస్ను భట్టి ఆదేశించారు.
సీపీఎస్ అంశం తన పరిధిలో లేదని, డిప్యూటీ సీఎం భట్టి స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఉద్యమం చేస్తామంటే ఎట్లా? పునరాలోచించాలని జేఏసీ నేతలను విక్రమార్క కోరారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని, నిర్దిష్టంగా ఏదో ఒక హామీ ఇస్తే ఆలోచిస్తామని జేఏసీ నేతలు స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భేటీ అవుదామని చెప్పగా, ఇప్పుడే తేల్చాలని జేఏసీ పట్టుబట్టినట్టు సమాచారం. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ కార్యవర్గం సోమవారం అత్యవసరంగా సమావేశం కానున్నది. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఈ సమావేశాన్ని నిర్వహించి.. అందరి అభిప్రాయాలనే జేఏసీ నేతలు స్వీకరిస్తారని సమాచారం.