Talasani Srinivas Yadav : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం PV మార్గ్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, విదేశీయులు కూడా మన ఆచారాలను ఎంతో గౌరవిస్తారని అన్నారు. సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు ఎంతో గొప్పగా చేసకుంటారని, యువతులు, మహిళలు రంగురంగుల ముగ్గులతో ఇంటి ముంగిళ్ళను ఎంతో అందంగా అలకరిస్తారని వివరించారు. పండుగలు మన సంస్కృతిని చాటి చెప్పుతాయని పేర్కొన్నారు. పిల్లలకు పండుగ ప్రత్యేకతలు, సాంప్రదాయాలను తెలియజెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని, పంటలు విస్తారంగా పండుతున్నాయని మంత్రి తెలిపారు.
సంక్రాంతి వేడుకల సందర్భంగా.. పీపుల్స్ ప్లాజా ప్రాంతమంతా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, సంక్రాంతి పాటలతో సందడిగా కనిపించింది. హరిదాసులకు మంత్రి తలసాని సంక్రాంతి కానుకలు అందజేశారు. చిన్నారులకు పతంగులను పంపిణీ చేసిన అనంతరం ఆయన కూడా పతంగులను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బాలరాజ్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, బాక్సర్ అశోక్, జాంబాగ్ శ్రీనివాస్, కృష్ణ గౌడ్, శైలేందర్, వెంకటేష్ రాజు, లక్ష్మీపతి, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.