హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : వృత్తివిద్యా కోర్సుల ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఈ నెల 26న కీలక భేటీ కానున్నది. కమిటీ చైర్మన్ జస్టిస్ స్వరూప్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి సహా పలువురు అధికారులు సమావేశం అవుతారు. 2022 -23, 2023-24, 2024 -25 బ్లాక్ పీరియడ్కుగాను ఇంజినీరింగ్ సహా అన్ని రకాల వృత్తి విద్యా కోర్సుల ఫీజులను సవరించాల్సి ఉన్నది. అందుకు టీఏఎఫ్ఆర్సీ గతంలోనే నోటిఫికేషన్ను జారీ చేసి కాలేజీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. కాలేజీలను పిలిచి ప్రత్యక్ష విచారణ చేస్తున్న తరుణంలోనే ఏఐసీటీఈ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ సిఫారసులను బహిర్గతం చేసింది. ఈ సిఫారసుల ప్రకారం కోర్సులను బట్టి పాలిటెక్నిక్ ఫీజు రూ.1,64,700 , బీటెక్ ఫీజు రూ.3, 67,900, పీజీ డిప్లొమా ఫీజు 4,50,200గా ఉన్నది. ఈ నేపథ్యంలో ఫీజుల సవరణపై విచారణను టీఏఎఫ్ఆర్సీ వాయిదా వేసింది. గురువారం టీఏఎఫ్ఆర్సీ భేటీలో ఫీజుల సవరణపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.