హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): అధిక ఫీజుల వసూలు సహా బీ క్యాటగిరి (యాజమాన్య కోటా) సీట్ల భర్తీలో అవకతవలకు పాల్పడిన ఇంజినీరింగ్ కాలేజీలపై తెలంగాణ ఫీజు, అడ్మిషన్స్ అండ్ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కన్నెర్రజేసింది. బీ కేటగిరి సీట్లను అక్రమంగా, మెరిట్తో నిమిత్తం లేకుండా కేటాయిస్తే సంబంధిత కాలేజీలపై ఒక్కో సీటుకు రూ.10 లక్షల జరిమానా విధించాలని తీర్మానించింది.
ఈ మేరకు శనివారం చైర్మన్ జస్టిస్ స్వరూప్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. మెరిట్ పాటించకుండా నింపిన సీట్లను రద్దుచేసి, మెరిట్ ఉన్న వారిలో భర్తీచేయనున్నట్టు ప్రకటించింది. బీ క్యాటగి సీట్ల భర్తీలో అక్రమాలకు పాల్పడిన దాదాపు 40 కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రులు టీఏఎఫ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థులు నుంచి స్వీకరించిన దరఖాస్తులను కాలేజీలకు పంపించిన కమిటీ, ఇప్పటివరకు కేటాయించిన మేనేజ్మెంట్ కోటా సీట్ల పరిస్థితిని పరిశీలించాలని నిర్ణయించింది.
జాబితాలను పరిశీలించి అక్రమాలు తేలితే జరిమానా విధించడమే కాకుండా ఆ సీట్లను ప్రతిభావంతులకు తిరిగి కేటాయిస్తామని తెలిపింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్హుస్సేన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అధిక ఫీజు వసూలుపై రూ.2 లక్షల జరిమానా..
ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు కాకుండా ఇతర పేర్లతో అదనంగా వసూలు చేసే కాలేజీలకు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించాలని కమిటీ నిర్ణయించింది. ట్యూషన్ ఫీజు, ల్యాబ్, లైబ్రరీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ వంటి 11 రకాలకు రూ.వెయ్యి.. పరీక్షలు, అకడమిక్ వంటి 7 రకాలపై రూ.1,500 చొప్పున మొత్తం రూ.2,500 వరకు తీసుకోవచ్చని జీవోలో పేర్కొన్నది. కాగా, కొన్ని కాలేజీలు అధికంగా వసూలు చేస్తున్నాయని టీఏఎఫ్ఆర్సీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వచ్చాయి. సీరియస్గా తీసుకున్న కమిటీ శనివారం నిర్వహించిన సమావేశంలో వాటిపై సమగ్రంగా చర్చించింది. అధిక ఫీజులు వసూలు చేసే కాలేజీలపై రూ.2 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ జరిమానాలను సీట్ల కేటాయింపు సమయంలో ఎంసెట్ కన్వీనర్కు విద్యార్థులు చెల్లించిన ఫీజు మొత్తం నుంచి మినహాయించుకొంటామని పేర్కొన్నది.
ఇప్పటికీ ఫిర్యాదు చేయవచ్చు..
మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో అక్రమాలు, అధిక ఫీజుల వసూలుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయవచ్చని టీఏఎఫ్ఆర్సీ వర్గాలు వెల్లడించాయి. మాసబ్ట్యాంక్లోని తమ కార్యాలయాన్ని సంప్రదించి, తగు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని సూచించాయి.