హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎన్.ఎం.ఎం.ఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) పోటీ పరీక్షపై టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని అందిస్తోందని సీఈవో శైలేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 29న (సోమవారం) టి-సాట్ విద్య చానల్లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్.ఎం.ఎం.ఎస్ పోటీ పరీక్షపై ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం ప్రసారమౌతుందన్నారు. ఎన్.సి.ఈ.ఆర్.టి అందించే ఈ ఉపకార వేతనాలు తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని సీఈవో గుర్తుచేశారు.
2022 విద్యా సంవత్సరానికి నవంబర్లో జరిగే పరీక్షకు అర్హత కలిగిన విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సిద్ధం చేసేందుకు టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. టి-సాట్ ఆధ్వర్యంలో జరిగే స్పెషల్ లైవ్ కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ పరిధిలోని ఎస్.సి.ఈ.ఆర్.టి., సైట్ (ఎస్.ఐ.ఈ.టి) భాగస్వాములౌతున్నాయన్నారు.
లైవ్ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని ఎన్.ఎం.ఎం.ఎస్ పోటీ పరీక్షకు సంబంధించి పరీక్ష విధానం, మెరిట్ సాధించే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు.
పోటీ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు 48వేలు ఎన్.సి.ఈ.ఆర్.టి అందించనుందని ఆయన పేర్కొన్నారు. టి-సాట్ అందించే లైవ్ కార్యక్రమాన్ని వీక్షించి ఫోన్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుమానాలను నివృత్తి చేసుకుని అధిక సంఖ్యలో అర్హత సాధించాలని సూచించారు.
లైవ్ కార్యక్రమం అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు నిపుణ ఛానల్ లో పున: ప్రసారం అవుతుందని శైలేష్ రెడ్డి తెలిపారు. లైవ్లో పాల్గొనాలనుకునే వారు 040 23540326, 23540726 టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4039 ఫోన్లకు కాల్ చేయాలని, టి-సాట్ సోషల్ మీడియాలోనూ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని శైలేష్ రెడ్డి తెలిపారు.