ఏప్రిల్ 4 నుంచి టెట్కు కోచింగ్
త్వరలోనే గ్రూప్-1కు కూడా
నోటిఫికేషన్లు రాగానే అన్నింటికీ
కోచింగ్ సెంటర్లకు దీటుగా శిక్షణ
హైదరాబాద్, మార్చి 29 : ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఉచితంగా డిజిటల్ శిక్షణ ఇచ్చేందుకు టీశాట్ ఏర్పాట్లు చేస్తున్నది. గ్రూప్-1, టెట్, టీచర్ పోస్టులు, పోలీస్, వైద్యారోగ్యశాఖలోని పలు పోస్టులకు పోటీ పడుతున్నవారికి కోచింగ్ సెంటర్లకు తీసిపోనివిధంగా ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఏప్రిల్ 4 నుంచి ఈ శిక్షణ ప్రారంభంకానున్నది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు 60 రోజులపాటు 102 ఎపిసోడ్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాలపాటు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడగానే గ్రూప్-1 శిక్షణ ప్రారంభించనున్నారు. రోజుకు రెండుగంటలపాటు శిక్షణ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాలుగు రోజుల్లోనే శిక్షణను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నిరకాల పోటీ పరీక్షల కోసం టీశాట్ 1,500 గంటల నిడివి గల వీడియో రికార్డులను సిద్ధంచేశారు. శిక్షణకు ముందు ఏప్రిల్ 1 నుంచి 7 వరకు వారంపాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఓరియంటేషన్ నిర్వహిస్తారు. ఒకరోజు పరీక్షలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తారు. ఏప్రిల్ 4 నుంచి టెట్ శిక్షణ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులకు టీశాట్ మాక్టెస్ట్లు కూడా నిర్వహించనున్నది.
కోచింగ్ కేంద్రాలకు వెళ్లి అప్పులపాలు కాకండి
అభ్యర్థులు తొందరపడి, కోచింగ్ కేంద్రాలకు వెళ్లి అప్పులపాలు కాకండి. కోచింగ్ సెంటర్లలో షెడ్యూల్ను బట్టే పాఠాలు చెప్తారు. కానీ, టీశాట్ పాఠాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నిసార్లయినా వినొచ్చు. నోటిఫికేషన్ల నేపథ్యంలో టీశాట్ ద్వారా అన్నిరకాల కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లైవ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. హెల్ప్లైన్లు ఏర్పాటు చేశాం. అభ్యర్థులంతా టీశాట్ పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలి.
– ఆర్ శైలేశ్రెడ్డి, టీశాట్ సీఈవో