తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం..
టీహబ్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): స్టార్టప్లకు మాత్రమే టీహబ్ వేదిక కాదని, ఇది రాబోయే తరానికి అంతర్జాతీయ వ్యాపార వేదికగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో దేశంలో ఏ ప్రభుత్వమూ తీసుకోనంత చొరవను తెలంగాణ ప్రభుత్వం దూరదృష్టితో తీసుకున్నదని చెప్పారు. మంగళవారం టీహబ్ ప్రారంభోత్సవంలో భాగంగా దేశ విదేశాల నుంచి వచ్చిన స్టార్టప్ రంగ నిపుణులు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఇతర రంగాల ప్రముఖులతో సమావేశమైన కేటీఆర్.. టీహబ్ ఏర్పాటు ఉద్దేశాన్ని, భవిష్యత్ లక్ష్యాలను వారికి వివరించారు. ‘టీహబ్ను ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో పరిమితం చేయడం లేదు.
దేశ విదేశాలకు చెందిన వారందరికీ ఇదో వేదిక. వినూత్న ఆలోచనలతో రండి… ఆవిష్కరణలతో వెళ్లండి.. అనే నినాదంతో రాష్ట్రప్రభుత్వం టీ హబ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసింది..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ తొలిదశను ప్రారంభించగా, అది ఐటీ రంగంలోనే నూతన ఒరవడిని సృష్టించిందని కేటీఆర్ తెలిపారు. టీహబ్ ద్వారా ఇప్పటివరకు 1100లకు పైగా స్టార్టప్లను ప్రోత్సహించినట్టు ఆయన వివరించారు. దాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో తొలి దశకు ఐదు రెట్ల ఎక్కువ విస్తీర్ణంలో రెండో దశ టీహబ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ,విదేశాలకు చెందిన వారికి ఇక్కడ చోటు కల్పిస్తూ వారి వ్యాపారాలను విశ్వవ్యాప్తం చేసేందుకు వీలుగా అవసరమైన అన్ని వనరులను సమకూరుస్తామని అన్నారు. వివిధ దేశాలు, కంపెనీలతో టీహబ్ ఒప్పందాలు చేసుకుంటున్నదని తెలిపారు. నేటి యువత ఏం కోరుకుంటున్నదో.. దానిని అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు.