హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఉన్నత విద్యారంగం నూతన డిజిటల్ విధానాలను అవలంబించాలని కోర్సెరా రీజినల్ డైరెక్టర్ పుష్కర్ కేల్కర్ ఉద్ఘాటించారు. ‘ఇండస్ట్రీ రెడీ స్కిల్స్’పై శుక్రవారం అనురాగ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సింపోజియంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా నూతన టెక్నాలజీల వినియోగం పెరిగిందని, వివిధ దేశాల్లోని దాదాపు 6 వేల విద్యాసంస్థలు, 10 కోట్ల మంది విద్యార్థులతో ‘కోర్సెరా ఫర్ క్యాంపస్’ అనుసంధానమైందని తెలిపారు. ఈ విద్యార్థుల్లో దాదాపు 1.5 కోట్ల మంది భారత్లోని వారేనని చెప్పారు. పారిశ్రామిక, మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కరిక్యులమ్ను రూపొందించేందుకు ఉన్నత విద్యా సంస్థలు ‘స్కిల్స్-ఫస్ట్’ విధానంపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు వివిధ రకాల కెరీర్ మార్గాలను ఎంచుకొనేందుకు బహుముఖ నైపుణ్యాలు దోహదపడతాయని, విస్తృత అవకాశాలున్న ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆన్లైన్ బోధన ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇండీగ్లోబల్ మీడియా నెట్వర్క్ సహకారంతో జరిగిన ఈ సింపోజియంలో అనురాగ్ యూనివర్సిటీ మేనేజింగ్ ట్రస్టీలు నీలిమ, అనురాగ్ పల్లా, వీహబ్ సీఈవో దీప్తి రావుల, గీతం వర్సిటీ బ్లెండెడ్ లెర్నింగ్ విభాగం డైరెక్టర్ రీమా గుప్తా, అనురాగ్ వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ రామచంద్రం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ జీ విష్ణుమూర్తి, ‘రియల్ పేజ్’ ఎండీ, హైసియా జాయింట్ సెక్రటరీ సందీప్ శర్మ, ‘ఇండీగ్లోబల్’ సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్ సుధీర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనురాగ్ వర్సిటీ మొబైల్ యాప్ను దీప్తి రావుల ఆవిష్కరించారు.